న్యూఢిల్లీ : మనీల్యాండరింగ్ కేసులో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని ఈడీ అధికారులు ప్రశ్నించడంపై శివసేన అభ్యంతరం వ్యక్తం చేసింది. ప్రత్యర్ధులను అంతమొందించేందుకు హిట్లర్ గ్యాస్ ఛాంబర్లను నిర్మించడం ఒక్కటే కేంద్ర ప్రభుత్వం తక్కువ చేస్తోందని కాషాయ పార్టీ తీరును తప్పుపట్టింది. దివంగత కాంగ్రెస్ నేతలు పండిట్ జవహర్ లాల్ నెహ్రూ, ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీల జ్ఞాపకాలను పాలక బీజేపీ చెరిపివేస్తోందని శివసేన పత్రిక సామ్నా సంపాదకీయం దుయ్యబట్టింది.
దర్యాప్తు అధికారులచే పదేపదే రాహుల్ను ప్రశ్నించేందుకు పిలిపిస్తూ రాజకీయ అహంకారాన్ని కాషాయ పార్టీ చాటుకుంటోందని ఆరోపించింది. ఎంతటి శక్తివంతమైన నాయకుడి కాలర్ అయినా పట్టుకుంటామనే సంకేతాలు పంపేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందని పేర్కొంది. దర్యాప్తు సంస్ధలను ప్రయోగించి ఇవాళ రాహుల్, సోనియా గాంధీని వేధిస్తున్నారని రేపు మరొకరి వంతని ఆందోళన వ్యక్తం చేసింది.
శివసేన, ఆర్జేడీ, ఎస్పీ, జేఎంఎం, కాంగ్రెస్, టీఎంసీ వంటి పార్టీలు ఈడీ నిఘాలో ఉన్నాయని పేర్కొంది. ఈడీ ఎన్నడూ బీజేపీ నేతపై దాడి చేసిన దాఖలాలు లేవని తెలిపింది. అనిల్ దేశ్ముఖ్, నవాబ్ మాలిక్, అభిషేక్ బెనర్జీ, సంజయ్ రౌత్, అనిల్ పరబ్, లాలూ ప్రసాద్ యాదవ్ వంటి విపక్ష నేతలనే ఈడీ టార్గెట్ చేసిందని సామ్నా సంపాదకీయం దుయ్యబట్టింది.