ముంబయి, అక్టోబర్ 27: రాష్ర్టాల్లో ప్రభుత్వాలను అస్థిర పరచడానికి మోదీ-షా ద్వయం చేస్తున్న ఎమ్మెల్యేల కొనుగోళ్ల వ్యవహారం ఎంతోకాలం దాగదని తేలిపోయింది. తెలంగాణలో స్వాముల ముసుగులో బీజేపీ బినామీలు చేసిన బ్రోకరిజం బయటపడి 24 గంటలు కాకుండానే.. మహారాష్ట్రలో నాలుగు నెలల క్రితం ఏక్నాథ్ షిండే వర్గాన్ని బీజేపీ చేసిన కొనుగోళ్ల గుట్టుమట్లు బట్టబయలయ్యాయి. గత జూన్ 30వ తేదీన షిండే వర్గం ఉద్ధవ్ ఠాక్రే సర్కారుపై తిరుగుబాటు చేసి.. అస్సాంలో క్యాంపు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఆ తరువాత బీజేపీతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసింది.
ఆ సమయంలో ఠాక్రేపై తిరగబడ్డ ఎమ్మెల్యేలకు బీజేపీ ఇచ్చిన బంపర్ ఆఫర్ల చిట్టా తాజాగా బట్టబయలైంది. దొంగల మధ్య పంపకాల తేడా వచ్చినప్పుడు దొంగతనం బయటపడినట్టుగానే.. ఏక్నాథ్ షిండే ప్రభుత్వానికి మద్దతిస్తున్న అత్యంత వివాదాస్పద ఎమ్మెల్యేల వ్యాఖ్యలు బీజేపీ కొనుగోళ్ల బండారాన్ని బయటపెట్టాయి. ప్రహార్ జనశక్తి పార్టీకి చెందిన బచ్చు కదు.. షిండే వెంట అస్సాం వెళ్లడానికి రూ.50 కోట్లు తీసుకొన్నారని స్వతంత్ర ఎమ్మెల్యే రవి రాణా ఆరోపించారు. దీనిపై కదు కూడా తీవ్రంగానే స్పందించారు. షిండే వెంట వెళ్లడానికి.. ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని మహా వికాస్ అఘాడీ ప్రభుత్వాన్ని పడగొట్టడానికి బీజేపీ నుంచి తాను రూ.50 కోట్లను తీసుకొని ఉంటే, తనతోపాటు రవి రాణా.. ఇతర ఎమ్మెల్యేలు అందరూ తీసుకొన్నట్టేనని కుండబద్దలు కొట్టారు.
ఈ వ్యాఖ్యలు మహారాష్ట్ర రాజకీయాల్లో ప్రస్తుతం ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. రవి రాణా, ఆయన భార్య నవనీత్ రాణా.. గత రంజాన్ పండుగరోజు ఉద్ధవ్ ఠాక్రే ఇంటిముందు హనుమాన్ చాలీసా చదివేందుకు ప్రయత్నించి, శాంతికి విఘాతం కలిగించే యత్నం చేశారన్న కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ముఖ్యమంత్రి షిండే, ఉప ముఖ్యమంత్రి ఫడ్నవిస్.. రాణా చేత క్షమాపణ చెప్పించకపోతే.. ప్రభుత్వం నుంచి తప్పుకొంటానని కూడా బచ్చుకదు హెచ్చరించారు. బచ్చుకదు, రాణా ఇద్దరూ అమరావతి నియోజక వర్గానికి చెందిన స్వతంత్ర ఎమ్మెల్యేలు. ఉద్ధవ్ ఠాక్రే మంత్రివర్గంలో బచ్చుకదు మంత్రిగా కూడా పనిచేశారు. అతివాద నేతగా కూడా ఇతనికి పేరున్నది. అధికారులతో రఫ్గా వ్యవహరిస్తారని పేరు. ఈ విషయంలోనే రెండు నెలలు జైలు జీవితాన్ని కూడా గడిపారు.
రవి రాణా తనకు క్షమాపణలు చెప్పడానికి బచ్చు కదు నవంబర్ 1 వరకు గడువు ఇచ్చారు. ఈ లోగా రాణా తన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోకపోతే.. కోర్టులో కేసు కూడా వేస్తానని హెచ్చరించారు. ఈ కేసులో షిండేను, ఫడ్నవిస్ను కూడా ప్రతివాదులుగా చేరుస్తానని హెచ్చరించారు. ఒక వేళ తాను డబ్బు తీసుకొని ఉంటే.. మిగతా యాభై మంది తీసుకొన్నట్టేనని.. వారికి డబ్బులు ఎవరి నుంచి వచ్చాయో చెప్పాల్సి ఉంటుందని స్పష్టంచేశారు. మరోవైపు తన తండ్రితో షిండే వర్గంలోని పలువురు ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారని ఉద్ధవ్ ఠాక్రే తనయుడు ఆదిత్య ఠాక్రే చెప్తున్నారు. షిండే పరిపాలనపై తీవ్ర అసంతృప్తితో వారు ఉన్నారని ఆదిత్య వ్యాఖ్యానిస్తున్నారు. షిండే వెంట వెళ్లిన వారిలో చాలామంది తమకు మంత్రి పదవులు ఇవ్వలేదని అసంతృప్తితో ఉన్నారు. మొత్తమ్మీద మహారాష్ట్రలో షిండే ప్రభుత్వం దినదిన గండంగా గడుపుతున్నది.