Maharashtra | ముంబై, ఏప్రిల్ 19: మహారాష్ట్రలో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీ చేస్తున్న ప్రయత్నాలు రివర్స్ కొట్టేలా కనిపిస్తున్నాయి. ప్రస్తుత సీఎం షిండేతో సహా 16 మంది శివసేన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడుతుందని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో.. కమలం పార్టీ తనదైన రాజకీయాలకు తెరలేపిందనే చర్చ రాష్ట్ర రాజకీయ వర్గాల్లో నడుస్తున్నది. అనర్హత వేటు పడినా ప్రభుత్వం కొసాగేందుకు ఎన్సీపీ అగ్రనేత అజిత్ పవార్తో జట్టు కట్టి, ఆయనకు సీఎం పీఠం ఇచ్చేలా బీజేపీ వ్యూహాలు రచిస్తున్నదని ప్రచారం జరుగుతున్నది. ఈ నేపథ్యంలో శివసేన (షిండే వర్గం) తీవ్రంగా స్పందించింది. ఎన్సీపీ నేత అజిత్ పవార్తో బీజేపీ కలిస్తే తాము ప్రభుత్వంలో ఉండబోమని హెచ్చరించింది. శివసేన అధికార ప్రతినిధి సంజయ్ సిర్సాత్ మంగళవారం ముంబైలో మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్సీపీ విషయంలో తమ విధానం స్పష్టంగా ఉన్నదని, ఎన్సీపీ ద్రోహం చేసే పార్టీ అని, ఆ పార్టీతో కలిసి ఉండబోమని పేర్కొన్నారు.
బీజేపీతో ఎన్సీపీ ప్రత్యక్షంగా జట్టు కట్టదని తాను అనుకొంటున్నట్టు శివసేన నేత సంజయ్ సిర్సాత్ అన్నారు. ఒకవేళ ఎన్సీపీతో కలిసి బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తే అది మహారాష్ట్ర ప్రజలకు నచ్చదని చెప్పారు. గతంలో కాంగ్రెస్, ఎన్సీపీతో కలిసి శివసేన ప్రభుత్వం ఏర్పాటు చేయడాన్ని ప్రజలు అంగీకరించకపోవడం వల్లే ఎంవీఏ సర్కార్ నుంచి తాము బయటకు వచ్చేందుకు నిర్ణయం తీసుకొన్నామని పేర్కొన్నారు. అజిత్ పవార్కు ఎన్సీపీలో స్వేచ్ఛ లేదని, ఒక్కడే ఎన్సీపీని వీడి వస్తే ఆయనను స్వాగతిస్తామని, ఒకవేళ ఎన్సీపీ ఇతర నేతలతో వస్తే తాము ప్రభుత్వంలో ఉండబోమని సిర్సాత్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు. గత లోక్సభ ఎన్నికల్లో కుమారుడు పార్థ పవార్ ఓడిపోవడంపై అజిత్ పవార్ అసంతృప్తిగా ఉన్నారే తప్ప.. ఆయన అసంతృప్తికి, సుప్రీంకోర్టులో 16 మంది శివసేన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ పెండింగ్ కేసుకు సంబంధం లేదని వెల్లడించారు.