న్యూఢిల్లీ: జాతీయ స్టాక్ ఎక్స్చేంజ్ మాజీ సీఈవో చిత్ర రామకృష్ణను 14 రోజుల జుడిషియల్ కస్టడీలోకి తీసుకున్నారు. స్టాక్ మార్కెట్లో అవకతవకలు జరిగిన కేసులో ఆమెను సీబీఐ విచారిస్తున్న విషయం తెలిసిందే. హిమాలయాల్లో నివసించే ఓ యోగికి స్టాక్ మార్కెట్కు చెందిన రహస్య సమాచారాన్ని చేరవేసినట్లు ఆమె ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో ఆమెను ఇప్పటికే సీబీఐ అరెస్టు చేసిన విసయం తెలిసిందే. అయితే బెయిల్ ఇవ్వాలంటూ ఆమె తాజాగా సుప్రీంలో పిటిషన్ వేసింది. కేసు దర్యాప్తు జరుగుతున్న నేపథ్యంలో బెయిల్ ఇవ్వవద్దు అని కోర్టులో సీబీఐ వాదించింది. అయితే చిత్ర అరెస్టుకు ఇవాళ కోర్టు ఆమోదం తెలిపింది. ప్రత్యేక వసతులు కల్పించాలని చిత్ర పెట్టుకున్న అభ్యర్థనలను కోర్టు తోసిపుచ్చింది. ఇంటి భోజనంతో పాటు ఇతర వసతులు కల్పించేందుకు నిరాకరించింది. ఖైదీలు అందరూ ఒక్కటే అని, గతంలో ఉన్న పొజిషన్ బట్టి.. ఆమెకు వీఐపీ ఖైదీ సౌకర్యాలు ఇవ్వలేమని, రూల్స్ను మార్చలేమని జడ్జి సంజీవ్ అగర్వాల్ తెలిపారు. కానీ హనుమాన్ ఛాలీసా ప్రార్థన పుస్తకాన్ని తనతో పాటు ఉంచుకునేందుకు కోర్టు అంగీకరించింది.