తిరువనంతపురం : కేరళలోని ఎర్నాకుళం జిల్లా కాలామస్సేరిలో (Kalamassery) ఉన్న ఓ కన్వన్షన్ సెంటర్లో వరుస పేలుళ్లు (Bomb Blast) సంభవించాయి. దీంతో ఒకరు మృతిచెందగా, 20 మందికిపైగా గాయపడ్డారు. జంట పేలుళ్ల ఘటనపై కాంగ్రెస్ నేత శశి థరూర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనను తిరువనంతపురం ఎంపీ తీవ్రంగా ఖండిస్తూ పోలీసులు తక్షణమే ఈ ఘటనపై చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. కేరళలో ప్రార్ధనా మందిరంపై బాంబు దాడి వార్త తనను తీవ్రంగా కలిచివేసిందని, అన్ని మతాలకు చెందిన పెద్దలు, నేతలు ఈ దాడిని తీవ్రంగా ఖండించాలని కోరుతున్నానని అన్నారు.
మరోవైపు దాడిపై విచారం వ్యక్తం చేసిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఘటనా స్ధలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టాలని జాతీయ దర్యాప్తు సంస్ధ (ఎన్ఐఏ), ఎన్ఎస్జీలను ఆదేశించారు. కాగా, ఆదివారం కాలామస్సేరి నెస్ట్ సమీపంలోని ఓ కన్వెన్షన్ సెంటర్లో (Convention Centre) క్రిస్టియన్ మతస్థులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి చుట్టుపక్కల మండలాలైన వరపుజ, అంగమలి, ఎడపల్లి నుంచి భారీ సంఖ్యలో జనాలు తరలివచ్చారు. ఉదయం 9.30 గంటల సమయంలో కన్వెన్షన్ హాల్ మధ్యలో ఒక్కరిగా భారీ పేలుడు జరిగింది.
మరికొద్ది క్షణాల్లోనే మరో రెండు, మూడు చిన్న పేలుళ్లు జరిగినట్లు ప్రత్యక్ష సాక్షులు వెల్లడించారు. కాగా, సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను దవాఖానకు తరలించారు. హాలులో ఉన్నవారిని బయటకు తీసుకొచ్చారు. అయితే కన్వెన్షన్ సెంటర్ లోపలి వైపు నుంచి తాళం వేసి ఉండటంతో క్షతగాత్రులను బయటకు తీసుకురావడంలో ఆలస్యమయిందని పోలీసులు తెలిపారు. కాగా, అది బాంబు పేలుడా లేదా మరొకటా అనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదని చెప్పారు.
Read More :
Bangladesh | హింసాత్మక నిరసనలు : బంగ్లా విపక్ష నేత అరెస్ట్