న్యూఢిల్లీ : కాంగ్రెస్ పార్టీ నూతన రధసారధిపై చర్చ ఊపందుకున్న నేపధ్యంలో ఎల్జేడీ నేత శరద్ యాదవ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ కోసం నిరంతరం శ్రమిస్తున్న రాహుల్ గాంధీకి పార్టీ పగ్గాలు అప్పగించాలని సూచించారు. కాంగ్రెస్ పార్టీని 24 గంటల పాటు నడిపిస్తూ కష్టపడుతున్న వారు ఎవరన్నా ఉంటే అది రాహుల్ గాంధీయేనని, ఆయనకు పార్టీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించాలని అప్పుడే ఆ పార్టీ మెరుగైన విజయాలు సాధిస్తుందని అన్నారు.
రాహుల్ పక్కన ఉండగా ఆయన ఈ వ్యాఖ్యలు చేయడంతో దీనిపై తాము చర్చిస్తామని రాహుల్ బదులివ్వడం విశేషం. ఇక పార్టీ అధ్యక్ష పదవికి ఎన్నికలు జరిగేంతవరకూ కాంగ్రెస్ పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలిగా సోనియా గాంధీ కొనసాగాలని మార్చిలో జరిగిన సీడబ్ల్యూసీ సమావేశం నిర్ణయించింది. పార్టీకి రాహుల్ గాంధీ నాయకత్వం వహించాలని ప్రతి కార్యకర్తా కోరుకుంటున్నారని సీడబ్ల్యూసీ భేటీ అనంతరం కాంగ్రెస్ ప్రతినిధి రణ్దీప్ సుర్జీవాలా చెప్పారు.
కర్నాటక కాంగ్రెస్ చీఫ్ డీకే శివకుమార్ సహా పలువురు పార్టీ నేతలు కాంగ్రెస్ చీఫ్గా తిరిగి రాహుల్ గాంధీ నియామకానికి మొగ్గుచూపుతున్నారు. కాగా 2019 లోక్సభ ఎన్నికల్లో పార్టీ ఓటమి అనంతరం కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రాహుల్ గాంధీ రాజీనామా చేశారు. రాహుల్ నిష్క్రమణతో పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలిగా సోనియా గాంధీ పార్టీ సారధ్య బాధ్యతలను చేపట్టారు.