ముంబై: మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్నాథ్ షిండేతో ఎన్సీపీ (ఎస్పీ) అధినేత శరద్ పవార్ సమావేశమయ్యారు. వారిద్దరూ కొంతసేపు ఏకాంతంగా చర్చించుకున్నారు. దీంతో ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివనేన (యూబీటీ)తో కూడిన ప్రతిపక్ష ఎంవీఏ కూటమిలో ఇది కలకలం రేపింది. (Sharad Pawar’s Meet Shinde) మహారాష్ట్ర-కర్ణాటక సరిహద్దు వివాదంపై ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ అధ్యక్షతన బుధవారం కీలక సమావేశం జరిగింది. మహారాష్ట్ర అసెంబ్లీలో జరిగిన ఈ సమావేశంలో ఎన్సీపీ (ఎస్పీ) అధినేత శరద్ పవార్ పాల్గొన్నారు.
కాగా, ఈ కార్యక్రమం తర్వాత అసెంబ్లీలోని డిప్యూటీ సీఎం ఏక్నాథ్ షిండే కార్యాలయానికి శరద్ పవార్ వెళ్లారు. కేబినెట్ సమావేశంలో పాల్గొన్న షిండే ఈ విషయం తెలుసుకున్నారు. కేబినెట్ సమావేశాన్ని మధ్యలోనే ముగించుకుని తన కార్యాలయానికి వెళ్లారు. అక్కడ వేచి ఉన్న శరద్ పవార్కు పూలగుత్తితో స్వాగతం పలికారు. వారిద్దరూ సుమారు 15 నిమిషాలపాటు మాట్లాడుకున్నారు. కేవలం ‘మర్యాదపూర్వక భేటీ’ అని షిండే కార్యాలయం పేర్కొంది. అయితే షిండేతో శరద్ పవార్ భేటీ కావడం రాజకీయ ఊహాగానాలకు ఆజ్యం పోసింది. శరద్ పవార్ పార్టీలోని ఒక వర్గం ఎన్డీయే కూటమిలో చేరడానికి ఆసక్తి చూపుతోందన్న ఊహాగానాలకు మరింత బలం చేకూర్చింది.
మరోవైపు ఎన్సీపీ (ఎస్పీ)కి మిత్రపక్షమైన శివసేన (యూబీటీ) తీవ్రంగా విమర్శించింది. షిండే కార్యాలయానికి శరద్ పవార్ స్వయంగా వెళ్లడంపై ఆ పార్టీ నేత సంజయ్ రౌత్ మండిపడ్డారు. ‘షిండేను ఆయన కార్యాలయంలోనే కలవాల్సిన అవసరం ఏముంది?’ అని ప్రశ్నించారు. ఎన్సీపీ (ఎస్పీ) విశ్వసనీయతను ఈ చర్య దెబ్బతీస్తుందని పేర్కొన్నారు. శివసేనను చీల్చిన షిండేను ‘ద్రోహి’గా సంజయ్ రౌత్ అభివర్ణించారు. ఆయనతో పవార్ జరిపిన భేటీ మిత్రపక్షాలన్నింటినీ బాధించిందని అన్నారు. ఎంవీఏ మిత్రపక్షాలన్నీ ఏక్నాథ్ షిండేకు దూరంగా ఉండాలని సూచించారు.