గుజరాత్ ముఖ్యమంత్రిగా నరేంద్ర మోదీ బాధ్యతల్లో ఉన్నప్పుడు ఆయనపై ఎలాంటి ప్రతీకార చర్యలకు, కక్షసాధింపు చర్యలకు దిగకూడదని తాను, అప్పటి ప్రధాని మన్మోహన్ నిర్ణయించుకున్నామని ఎన్సీపీ అధినేత శరద్ పవార్ వెల్లడించారు. మోదీ గుజరాత్ సీంఎగా ఉన్నప్పుడు, తరచూ అప్పటి ప్రధాని మన్మోహన్పై రాజకీయంగా దాడి చేసేవారని, అయినా.. ఆయనపై ఎలాంటి కక్షసాధింపులకు దిగకూడదని ఇద్దరమూ నిర్ణయించుకున్నామని పవార్ పేర్కొన్నారు. ఓ మరాఠీ ఛానల్కిచ్చిన ఇంటర్వ్యూలో పవార్ పై వ్యాఖ్యలు చేశారు.
అప్పట్లో మీ యూపీఏ ప్రభుత్వంపై మోదీ తరచుగా విమర్శలు చేస్తుండేవారు. అయినా ఆయనపై ఎలంటి కక్షసాధింపు చర్యలకు దిగకూడదని నిర్ణయించారట నిజమేనా? అని ఆ ఇంటర్వ్యూలో పవార్ను ప్రశ్నించగా… ‘అవును ఇది పాక్షికంగా నిజమే’ అని కుండబద్దలు కొట్టారు. ”ఆయనో రాష్ట్రానికి ముఖ్యమంత్రి. ఆయనకు గుజరాతీలు స్పష్టమైన మెజారిటీని కట్టబెట్టారు. రాష్ట్ర సమస్యలపై ఢిల్లీకి వస్తే, వాటికి పరిష్కారం చూపాల్సిన బాధ్యత కూడా మనపై ఉంటుంది. అతి త్వరలోనే ఆ సమస్యకు పరిష్కారం చూపిస్తాం అని చెప్పి పంపాల్సి ఉంటుందని మా సహచరులతో స్పష్టంగానే చెప్పేవాడిని. రాజకీయ భేదాభిప్రాయాలు రాష్ట్ర ప్రజలపై ఏమాత్రం ప్రభావం చూపకడదు అని స్పష్టంగానే నిర్ణయించుకున్నాం కక్ష సాధింపు చర్యలను మేమిద్దరం తీవ్రంగా వ్యతిరేకించాం” పవార్ గుర్తు చేసుకున్నారు.
నరేంద్ర మోదీ గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు తాను కేంద్ర కేబినెట్ మంత్రిగా బాధ్యతల్లో ఉండేవాడినని పవార్ గుర్తు చేసుకున్నారు. ఓ విషయంలో అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశం నిర్వహించాలని అప్పటి ప్రధాని మన్మోహన్ సిద్ధమయ్యారని, అయితే మోదీ బీజేపీ పాలిత ముఖ్యమంత్రులకు నాయకత్వం వహించి, ప్రధాని సర్కారును దునుమాడారని, అయినా తాము ఎలాంటి ప్రతీకార చర్యలకు దిగకూడదని తామిద్దరమూ నిర్ణయించుకున్నామని పవార్ వెల్లడించారు. ఈ సమయంలో మోదీకి దీటుగా ఎలా బదులివ్వాలో ఓ వ్యూహాన్ని వేశామని పవార్ పేర్కొన్నారు. అంతటి క్లిష్ట సమయంలోనూ మోదీతో ఎవరూ మాట్లాడేవారు కాదని, యూపీఏ మొత్తంలో తానొక్కడినే మోదీతో మాట్లాడేవాడినని పవార్ వెల్లడించారు.