పుణె: కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ మీద ఎక్సైజ్ డ్యూటీ తగ్గించడంపై ఎన్సీపీ చీఫ్ శరద్పవార్ ( Sharad Pawar ) తనదైన శైలిలో స్పందించారు. పెట్రోల్, డీజిల్ మీద ఎక్సైజ్ డ్యూటీ తగ్గించిన కేంద్రం.. రాష్ట్రాలకు బకాయిపడి ఉన్న జీఎస్టీ పరిహారం కూడా చెల్లిస్తే బాగుంటుంది అన్నారు. కేంద్రం జీఎస్టీ బకాయిలు చెల్లిస్తే రాష్ట్రాలు కూడా ఇంధన ధరలపై వ్యాట్ను తగ్గించడానికి వీలు పడుతుందని చెప్పారు. పుణెలో మీడియాతో మాట్లాడుతూ పవార్ పైవిధంగా స్పందించారు.
కేంద్ర ఆర్థిక శాఖ పెట్రోల్, డీజిల్పై ఎక్సైజ్ డ్యూటీని తగ్గిస్తూ బుధవారం ఒక ప్రకటన చేసింది. పెట్రోల్పై రూ.5, డీజిల్పై రూ.10 ఎక్సైజ్ సుంకాన్ని తగ్గిస్తున్నట్లు వెల్లడించింది. ఈ నేపథ్యంలో పలు బీజేపీ పాలిత రాష్ట్రాలు స్థానికంగా ఇంధన ధరలపై వ్యాట్ను తగ్గించాయి. దాంతో మహారాష్ట్రలో కూడా వ్యాట్ను తగ్గిస్తున్నారా.. అని మీడియా ప్రతినిధులు పవార్ను ప్రశ్నించారు. దాంతో పవార్ జీఎస్టీ బకాయిల ప్రస్తావన తెచ్చారు.