న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం శనివారం ఎల్పీజీ సిలిండర్ల ధరల పెంపును ప్రకటించిన అనంతరం మోదీ సర్కార్పై కాంగ్రెస్ ప్రతినిధి పవన్ ఖేరా విరుచుకుపడ్డారు. ప్రధాని నరేంద్ర మోదీ యూరప్ టూర్ను ప్రస్తావిస్తూ మూడు దేశాల్లో 65 గంటలు..60 ఫోటోషూట్లతో హడావిడి చేసిన మోదీ సాబ్ ఎల్పీజీ ధరల బహుమతితో దేశానికి తిరిగివచ్చారని ఎద్దేవా చేశారు.
ఎల్పీజీ సిలిండర్ ధరను కేంద్రం రూ 50 పెంచడంతో సిలిండర్ ధర రేపటి నుంటి పలు ప్రాంతాల్లో ఏకంగా రూ వేయికి ఎగబాకనుంది. మోదీ ప్రభుత్వం నిత్యావసరాల ధరల పెంపుతో సామాన్యుడిపై పెనుభారం మోపుతోందని ఖేరా దుయ్యబట్టారు. సబ్సిడీ వదిలివేయాలని మోదీ సర్కార్ ప్రజలను కోరుతోందని అన్నారు. తరచూ గ్యాస్, పెట్రో ధరలు పెంచుతూ ప్రజలపై ధరల భారాన్ని మోపుతోందని అన్నారు.
ధరల మోతను తట్టుకోలేని దశలో ప్రజలు ఎల్పీజీ సిలిండర్లను అప్పగించే పరిస్ధితి తీసుకువచ్చారని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం పేద, మధ్యతరగతి ప్రజలను ఆదుకుంటే మోదీ ప్రభుత్వం సామాన్యుల నడ్డి విరుస్తోందని పవన్ ఖేరా విమర్శించారు.