న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ గత రెండు రోజుల నుంచి మండిపోతోంది. భానుడి భగభగతో నగరం ఉక్కిరిబిక్కిరి అవుతోంది. అయితే ఇవాళ మరింత తీవ్ర స్థాయిలో ఎండలు ఉండనున్నట్లు వాతావరణశాఖ తెలిపింది. ఈ నేపథ్యంలో ఐఎండీ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. నగరంలోని కొన్ని చోట్ల ఇవాళ 46 లేదా 47 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అయ్యే అవకాశాలు ఉన్నట్లు ఐఎండీ పేర్కొన్నది. సఫ్దార్జంగ్ అబ్జర్వేటరీ వద్ద శుక్రవారం అత్యధికంగా 42.5 డిగ్రీలు నమోదు అయింది. ఇక నజఫ్గర్లో శుక్రవారం అత్యధికంగా 46.1 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. జఫార్పూర్, ముంగేశ్పూర్లో అత్యధికంగా 45.6 డిగ్రీలు నమోదు అయ్యాయి. ఢిల్లీలోని పీతాంపురలో కూడా రికార్డు ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. అక్కడ 44.7 డిగ్రీలు నమోదు అయినట్లు తెలుస్తోంది. ఆదివారం కోసం కూడా ఎల్లో అలర్ట్ జారీ చేశారు. వచ్చే వారం మబ్బులు నిండిన ఆకాశం, చిరు జల్లుల వల్ల కొంత ఊరట లభించే అవకాశాలు ఉన్నాయి. ఈ ఏడాది వేసవిలో ఇది అయిదో హీట్వేవ్. మార్చిలో ఓసారి భారీ ఎండలు కొట్టాయి. ఆ తర్వాత ఏప్రిల్లో మూడుసార్లు అధిక ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి.