న్యూఢిల్లీ: ఈ సారి ఎండలతో భారత్ అల్లాడిపోతున్నది. భారత్లోని అనేక నగరాలు నిప్పుల కుంపటిలా మారాయంటే అతిశయోక్తి కాదు. ప్రపంచంలో టాప్ 100 అత్యంత వేడి నగరాల్లో 95 భారత్లో ఉన్నాయంటూ ‘ఏక్యూఐ.ఇన్’ రియల్టైమ్ గ్లోబల్ టెంపరేచర్ ర్యాంకింగ్స్ను విడుదల చేసింది. ఏప్రిల్ 24 సాయంత్రం 5 గంటలకు తీసుకున్న డాటా ప్రకారం, టాప్-20 వేడి నగరాల్లో ప్రయాగ్రాజ్ (44 డిగ్రీల సెల్సియస్), అలహాబాద్, మొరాదాబాద్ తదితర నగరాలు ముందున్నాయి.
భారత్ ఉపఖండమంతటా ఉష్ణోగ్రత, వేడి గాలుల తీవ్రత పెరిగింది. మహారాష్ట్ర, తెలంగాణ, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఒడిశా రాష్ర్టాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. భూమిపై అత్యంత వేడితో ఉన్న ప్రాంతంగా భారత్ కొనసాగుతున్నదని నివేదిక పేర్కొన్నది. డజనుకుపైగా నగరాల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల సెల్సియస్ దాటింది.