Farmers | (స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్ (నమస్తే తెలంగాణ): అభివృద్ధి, వ్యవసాయంలో దేశానికి గుజరాత్ ఒక మాడల్ అనే బీజేపీ నేతల ప్రగల్భాలు వాస్తవ విరుధ్ధంగా ఉన్నాయి. గుజరాత్ వ్యవసాయం రంగం అస్తవ్యస్తంగా ఉన్నదని, రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోయారని పలు నివేదికలు రుజువు చేస్తున్నాయి. వెనుకబడిన రాష్ర్టాలైన బీహార్, ఒడిశా, ఛత్తీస్గఢ్, ఉత్తరాఖండ్ రైతుల కంటే గుజరాత్ రైతుల పరిస్థితి రోజురోజుకూ దీనంగా మారుతున్నదని కేంద్ర వ్యవసాయ శాఖ వార్షిక నివేదిక (2021-22) వెల్లడించింది.
గుజరాత్లో ప్రతి రైతు కుటుంబంపై రూ.56,568 అప్పు ఉన్నట్లు నివేదిక పేర్కొన్నది. అదే నివేదిక ప్రకారం బీహార్లో ప్రతి రైతు కుటుంబంపై రూ.23,534, పశ్చిమ బెంగాల్లో రూ.26,452, ఉత్తరాఖండ్లో రూ.48,338 అప్పు ఉన్నది. గుజరాత్లోని ప్రతి రైతు కుటుంబం నెలవారీ ఆదాయం రూ.12,631 ఉండగా, ఇది బీహార్, పశ్చిమబెంగాల్, ఒడిశా, ఛత్తీస్గఢ్, ఉత్తరాఖండ్లోని రైతుల నెలవారీ ఆదాయం కంటే చాలా తక్కువ. ఒక్కో త్రైమాసికంలో ఒక్కో రైతు రుణం రూ.1.71 లక్షల నుంచి రూ. 2.48 లక్షలకు పెరిగింది.
2020లో 126 మంది రైతులు, కూలీలు ఆత్మహత్య చేసుకొన్నారు. అప్పుల భారమే దీనికి మూల కారణమని కొందరి విశ్లేషణ.
పెరిగిన సాగు ఖర్చులకు అనుగుణంగా వ్యవసాయ ఉత్పత్తుల ధరలు పెరగకపోవడంతో రైతులు అప్పుల పాలవుతున్నారు. అందుకే రైతుల ఆదాయానికి, ఖర్చుకు మధ్య వ్యత్యాసం పెరుగుతున్నది. చిన్న, సన్నకారు రైతులు అప్పుల ఊబి నుంచి బయటపడటానికి వాణిజ్య పంటలు పండిస్తున్నారు. వ్యవసాయం వాణిజ్యం కావడంతో రైతులు మరింత అప్పుల్లో కూరుకుపోతున్నారు.
– రాజేంద్ర ఖిమానీ, వ్యవసాయ శాస్త్రవేత్త