Kamal Nath-Congress | కాంగ్రెస్ పార్టీకి మధ్యప్రదేశ్లో గట్టి ఎదురుదెబ్బ తగిలే అవకాశాలు కనిపిస్తున్నాయి. మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కమల్ నాథ్, ఆయన కొడుకు- చింద్వారా ఎంపీ నకుల్ సింగ్.. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీలో చేరేందుకు సిద్ధమయ్యారన్న వార్తల నేపథ్యంలో కీలక పరిణామం చోటు చేసుకున్నది. కమల్ నాథ్ వర్గం కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆయనకు మద్దతుగా ఆదివారం ఢిల్లీకి చేరుకున్నట్లు తెలుస్తున్నది. వీరిలో చింద్వారా నుంచి ముగ్గురు, మరో ప్రాంతం నుంచి ముగ్గురు ఎమ్మెల్యేలు ఉన్నారని కమల్ నాథ్ సన్నిహిత వర్గాలు తెలిపాయి.
కమల్నాథ్, ఆయన కొడుకు నకుల్నాథ్ పార్టీకి గుడ్ బై చెప్పి బీజేపీలో చేరనున్నారన్న వార్తలు రావడంతో కాంగ్రెస్ పార్టీ హై కమాండ్ అలర్టయింది. మధ్యప్రదేశ్లోని తమ పార్టీ ఎమ్మెల్యేలతో సంప్రదింపులు జరుపుతున్నది. కానీ, కమల్ నాథ్ వర్గం ఎమ్మెల్యేలు మాత్రం కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఫోన్ కాల్స్కు స్పందించడం లేదని తెలుస్తున్నది. హస్తినకు వెళ్లిన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలతోపాటు సీనియర్ నేత, మాజీ మంత్రి లఖన్ గంగోరియా కూడా ఉన్నట్లు సమాచారం.
తొమ్మిది సార్లు చింద్వారా నుంచి లోక్ సభకు ప్రాతినిధ్యం వహించిన కమల్ నాథ్.. ప్రస్తుతం అదే స్థానం నుంచి అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. గతేడాది చివర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 66 స్థానాలకు పరిమితమైంది. దీనికి కమల్ నాథ్ వైఖరే కారణం అని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నిర్ధారణకు వచ్చినట్లు సమాచారం. దీంతో మధ్యప్రదేశ్ పీసీసీ అధ్యక్ష పదవికి కూడా కమల్ నాథ్ రాజీనామా చేశారు.
అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత మధ్యప్రదేశ్ పీసీసీ అధ్యక్ష పదవి నుంచి కమల్ నాథ్ను తప్పించడం తమ మనోభావాలను గాయ పరిచిందని మాజీ మంత్రి, కమల్ నాథ్ సన్నిహితుడు దీపక్ సక్సేనా చెప్పారు. ‘మా నాయకుడికి అన్ని విధాల గౌరవం దక్కాలి. ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా, ఆయన వెంటే ఉంటాం’ అని చెప్పారు.
మరో కమల్ నాథ్ సన్నిహితుడు మాజీ మంత్రి విక్రమ్ వర్మ తన ‘ఎక్స్ (మాజీ ట్విట్టర్)’ ఖాతాలో ‘జై శ్రీరామ్’ అని రాశారు. ‘కమల్ నాథ్ వెంటే నేనూ నడుస్తా’ అని మీడియాకు చెప్పారు. కమల్ నాథ్ కు మద్దతుగా 23 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీని వీడే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తున్నది.