రాంచీ: జార్ఖండ్లో వినియోగంలో లేని బొగ్గు గని కూలింది. అందులో సుమారు 50 వరకు చిక్కుకుని ఉంటారని అనుమానిస్తున్నారు. ధన్బాద్ జిల్లాలో గురువారం ఉదయం ఈ ఘటన జరిగింది. వినియోగంలో లేని బొగ్గు గనిలో కొందరు అక్రమంగా తవ్వకాలు జరుపుతుండగా ఈ ఘటన జరిగినట్లు స్థానిక మీడియా పేర్కొంది. అయితే అధికారులు దీనిని ఖండించారు. ధన్బాద్లో ఉదయం 8:30 గంటలకు భారత్ కొకింగ్ కోల్ లిమిటెడ్ (బీసీసీఎల్)కు చెందిన తాత్కాలికంగా మూసివేసిన మైనింగ్ లీజు ప్రాంతానికి సమీపంలో 60 అడుగుల ‘కచ్చా’ రహదారి కుప్పకూలిందని ధన్బాద్ డిప్యూటీ కమిషనర్ తెలిపారు. ఇప్పటి వరకు అందులో ఎవరూ చిక్కుకోలేదని, ఎవరూ చనిపోవడం లేదా గాయపడటం జరుగలేదని చెప్పారు.
కాగా, ఈ ఏడాది ఫిబ్రవరిలో కూడా జార్ఖండ్లో ఇలాంటి ఘటనే జరిగింది. వినియోగంలో లేని బొగ్గు గనిలో అక్రమంగా తవ్వకాలు జరుపుతుండగా కూలింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మరణించారు. ధన్బాద్ నిర్సా బ్లాక్లోని ఈసీఎల్ ముగ్మా ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. మైనింగ్ సామగ్రికి చెందిన పరికరం 20 అడుగుల ఎత్తు నుంచి పడటంతో ఆ భాగం కూలిపోయింది. దీంతో అక్కడ అక్రమంగా బొగ్గు తవ్వకాలు జరుపుతున్న ఐదుగురు అందులో చిక్కుకుని చనిపోయారు. ఈ ప్రాంతంలో ఇలాంటి ఘటనలు తరచుగా జరుగుతున్నాయి. వదిలేసిన బొగ్గు గనుల్లో స్థానికులు అక్రమ తవ్వకాలకు పాల్పడి ప్రమాదాల బారిన పడుతున్నారు.