న్యూఢిల్లీ, ఫిబ్రవరి 18: జార్ఖండ్ ప్రభుత్వంలో మరో ముసలం పుట్టింది. ఇటీవలే ముఖ్యమంత్రి పదవిని చేపట్టిన చంపయీ సొరేన్కు కొత్త తలనొప్పి వచ్చి పడింది. సోరెన్ తన క్యాబినెట్లో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ఆలంగిర్ ఆలమ్, రామేశ్వర్ ఓరోన్, బన్నాగుప్తా, బాదల్ పత్రలేకఖ్కు మరోసారి చోటివ్వటంతో మిగిలిన వారిలో అసంతృప్తి రగిలింది. ముందుగా మంత్రుల ప్రమాణస్వీకారాన్నే బహిష్కరించి తమ నిరసనను తెలియచేయాలనుకున్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు. కానీ తర్వాత వ్యూహం మార్చుకుని హైకమాండ్ దగ్గరే అమీతుమీ తేల్చుకోవటానికి 12 మంది ఎమ్మెల్యేలు ఢిల్లీకి వెళ్లారు. జార్ఖండ్ మంత్రివర్గాన్ని పునర్వ్యవస్థీకరించాలని డిమాండ్ చేస్తున్నారు.
రాష్ట్ర అసెంబ్లీలో జేఎంఎంకు 29 మంది ఎమ్మెల్యేల బలం ఉండగా.. కాంగ్రెస్కు 17 మంది ఎమ్మెల్యేలున్నారు. మంత్రివర్గ కూర్పులో తమకు తగిన ప్రాధాన్యం ఉండాలని కాంగ్రెస్ అసంతృప్త ఎమ్మెల్యేలు డిమాండ్ చేస్తున్నారు. ఒకరికి ఒక పదవే ఉండాలని వారు కోరుతున్నారు. ఆలంగిర్ ఆలమ్కు మంత్రిగా కొనసాగాలనుకుంటే సీఎల్పీ పదవి నుంచి తప్పుకోవాలని డిమాండ్ చేశారు. వారిని శాంతింప చేయటానికి జేఎంఎం మంత్రి బసంత్ సొరేన్ రాంచీలో సంప్రదింపులు జరుపుతున్నారు. ప్రభుత్వంలో ఎలాంటి గందరగోళం లేదని, తామంతా ఐక్యంగా ఉన్నామని బసంత్ సొరేన్ వ్యాఖ్యానించారు. అయితే అసంతృప్త ఎమ్మెల్యేలు తమ డిమాండ్లను నెరవేర్చకపోతే రాబోయే అసెంబ్లీ సమావేశాలను బహిష్కరిస్తామని హెచ్చరించారు.
జేఎంఎం ఎమ్మెల్యేలలో కొత్త వారికి మంత్రివర్గంలో స్థానం కల్పించినప్పుడు కాంగ్రెస్ తరుఫున కూడా అవకాశం కల్పించవచ్చు కదా అని వారు ప్రశ్నిస్తున్నారు. కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు దీపికా పాండే సింగ్ స్పందిస్తూ క్యాబినెట్లో మహిళలకు తగిన ప్రాధాన్యం కల్పించాలని కోరారు. కేవలం ఒక్కరికే అవకాశం కల్పించటాన్ని ఎవరూ సమర్థించరని వాదించారు. కాంగ్రెస్ హైకమాండ్ దృష్టికి అసమ్మతి స్వరాలు వినిపించారు. ఈ విషయంలో కల్పించుకోవాలని కేసీ వేణుగోపాల్ను కోరినట్టు మందార్ కాంగ్రెస్ ఎమ్మెల్యే శిల్పి నేహా టిర్కీ చెప్పారు. తమ పార్టీ ఎమ్మెల్యేలు లేవనెత్తిన అంశాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నామని జార్ఖండ్ రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ రాజేశ్ ఠాకూర్ తెలిపారు. త్వరలో దీన్ని కేంద్ర నాయకత్వం పరిష్కరిస్తుందని హామీ ఇచ్చారు. జార్ఖండ్లో జరుగుతున్న సంఘటనలను ప్రతిపక్షాలు నిశితంగా గమనిస్తున్నాయి. బీజేపీ, ఏజేఎస్యూ పార్టీలు పరిణామాలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నాయి.
కొత్త క్యాబినెట్పై విభేదాల నేపథ్యంలో జార్ఖండ్ సీఎం చంపయీ సొరేన్ ఢిల్లీలో కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గేతో భేటీ అయ్యారు. మంత్రివర్గ కూర్పుపై జేఎంఎం, కాంగ్రెస్ మధ్య విభేదాలు అంశంపైనే సొరేన్తోపాటు జార్ఖండ్ కాంగ్రెస్ అధ్యక్షుడు రాజేశ్ ఠాకూర్ కూడా ఖర్గేతో సమావేశమయ్యారు. మంత్రివర్గంపై అసమ్మతి వ్యక్తం చేసిన 12 మంది ఎమ్మెల్యేలు కూడా ప్రస్తుతం ఢిల్లీలోనే మకాం వేశారు. తన ఢిల్లీ పర్యటనపై ముఖ్యమంత్రి సొరేన్ మాట్లాడుతూ తాను సీఎం అయ్యాక తొలిసారి ఢిల్లీకి వచ్చానని చెప్పారు. ఖర్గేతో ఆయన భేటీకి ముందు కాంగ్రెస్ ఎమ్మెల్యేల అసమ్మతి గురించి అడగ్గా.. అది కాంగ్రెస్ అంతర్గత వ్యవహారమని, వారి పార్టీనే పరిష్కరించుకుంటుందని, దాని గురించి తాను చెప్పేది ఏమీ లేదని పేర్కొన్నారు. ఇటు జేఎంఎంలో కానీ, అటు కాంగ్రెస్లో కానీ విభేదాలు ఏమీ లేవని.. అంతా బాగుందని చెప్పారు. జార్ఖండ్లో చంపయీ క్యాబినెట్లో 8 మంది మంత్రులు శనివారం ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే. దీనిపైనే కొంతమంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అసంతృప్తి వ్యక్తం చేశారు.