కోల్కతా: పశ్చిమబెంగాల్లో మరో మూడు రోజుల్లో మూడు అసెంబ్లీ స్థానాలకు ఉపఎన్నికలు జరుగనున్నాయి. ఈ నెల 30న మూడు నియోజకవర్గాల్లో ఉప ఎన్నికల పోలింగ్ జరుగనుంది. ప్రచారానికి ఆఖరి రెండు రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రధాన పార్టీలైన బీజేపీ, తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తల మధ్య పరస్పర దాడులు చేటుచేకుంటున్నాయి. తాజాగా కోల్కతాలో బీజేపీ కార్యకర్తలపై టీఎంసీ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో పలువురు బీజేపీ కార్యకర్తలకు గాయాలయ్యాయి.
ఘటనపై బెంగాల్ బీజేపీ నాయకురాలు అగ్నిమిత్ర పౌల్ ఆగ్రహం వ్యక్తంచేశారు. పశ్చిమబెంగాల్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి మమతాబెనర్జి అసహనంతో ఊగిపోతున్నారని, వాళ్లు తమను కనీసం ప్రచారం చేసుకోవడానికి కూడా అనుమతించడం లేదని ఆరోపించారు. టీఎంసీ గూండాలు తరచూ తమ కార్యకర్తలను హింసిస్తున్నారని, భౌతిక దాడులకు పాల్పడుతున్నారని ఆమె మండిపడ్డారు. ఓటర్లు వీటిని గమనించి ఈ నెల 30న ఎవరికి ఓటేయాలో నిర్ణయించుకోవాలని అగ్నిమిత్ర పౌల్ సూచించారు.
ఈ నెల 30న పశ్చిమబెంగాల్లోని భవానీపూర్, షంషేర్గంజ్, జాంగీర్పూర్ అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరుగనున్నాయి. వీటిలో భవానీపూర్ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి మమతాబెనర్జి స్వయంగా పోటీచేస్తున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో మమతాబెనర్జి.. టీఎంసీని వీడి బీజేపీలో చేరిన సువేంధు అధికారిని ఓడించడం కోసం ఆమె పర్మినెంట్ నియోజకవర్గం భవానీపూర్కు బదులుగా నందిగ్రామ్ నుంచి పోటీచేశారు. అయితే, నందిగ్రామ్ సువేంధు స్వస్థలం కావడంతో మమత ఓడిపోయారు. ఈ నేపథ్యంలో ఆమె తాజాగా భవానీపూర్ నుంచి పోటీపడుతున్నారు.