Odisha Train Accident | కోల్కతా, జూన్ 3: ఒడిశా రైలు ప్రమాదం తమ పాలిట కాళరాత్రిగా మారిందని పలువురు బాధిత ప్రయాణికులు తెలిపారు. బతుకు తెరువు కోసం దక్షిణాది రాష్ట్రాలకు వెళ్లిన చాలా మంది బెంగాలీలు బెంగళూరు-హౌరా ఎక్స్ప్రెస్లో స్వరాష్ట్రానికి వస్తూ ఈ ప్రమాదం బారిన పడ్డారు. ప్రయాణికుల స్పందన వారి మాటల్లోనే…
వేగంగా వెళుతున్న రైల్లో ఒక్కసారిగా నేను పై బెర్తు నుంచి కిందపడ్డాను. లైట్లన్నీ ఆరిపోయాయి. కష్టమ్మీద నేను బోగీ నుంచి బయటపడగలిగాను. చుట్టూ పరికిస్తే గాయపడ్డ ప్రయాణికుల హాహాకారాలు వినిపించాయి.
-మిజాన్ ఉల్ హక్, బర్దమాన్ నివాసి
నా తల, పాదాలు, ఛాతికి గాయాలయ్యాయి. ప్రాణాలను రక్షించుకోవడానికి కిటికీలను బద్దలు కొట్టి బయటకు దూకాం.
– బర్దమాన్కు చెందిన ప్రయాణికుడు
ప్రమాదం జరిగిన వెంటనే అంతా గందరగోళంలా అనిపించింది. మేము మా కంపార్ట్మెంట్ నుంచి బయటికొచ్చి పక్కనే ఉన్న పొలాల్లో చిమ్మ చీకట్లో భయం భయంగా గడిపాం.
– రేఖ, బెంగళూరు నివాసి
ఒడిశా రైలు ప్రమాదం నిర్వేదాన్ని, విషాదాన్ని కలిగించిందని ఆ రాష్ట్ర అగ్నిమాపక శాఖ డైరెక్టర్ జనరల్ సుధాంశు సారంగి ఆవేదన వ్యక్తం చేశారు. సహాయక చర్యలపై ఆయన మాట్లాడుతూ.. ‘కొన్ని క్రేన్లతో బోగీలను తొలగించాలని ప్రయత్నించి విఫలమయ్యాం. ఇప్పుడు ఇంకో క్రేన్ తెప్పించాం. బోగీల కింద బాధితులు ఉండరనే భావిస్తున్నాం. మా జీవితంలో ఇన్ని మృతదేహాలను ఎప్పుడూ చూడలేదు’ అని అన్నారు.