ముంబై: మహారాష్ట్రలో మళ్లీ రాజకీయ పరిణామాలు మారబోతున్నాయి. శివసేన (యూబీటీ) పార్టీకి చెందిన ఏడుగురు ఎంపీలు ఉపముఖ్యమంత్రి ఏకనాథ్ షిండే నేతృత్వంలోని శివసేన వర్గంలోకి మారేందుకు సిద్ధం అవుతున్నారని సమాచారం. జూన్ 7న న్యూఢిల్లీలో ఏకనాథ్ షిండే, ఉద్ధవ్ ఠాక్రే వర్గానికి చెందిన పలువురు ఎంపీల మధ్య రహస్య సమావేశం జరిగిందని సమాచారం. ఇది ‘యూబీటీ’ వర్గంలో మరో చీలిక రాబోతున్నదనే ఊహాగానాలను బలపరిచేలా ఉందంటున్నారు.
కేంద్ర మంత్రి వర్గ విస్తరణ జరగవచ్చనే ప్రచారం నేపథ్యంలో ఈ పరిణామాలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఠాక్రే వర్గానికి చెందిన ఒక ఎంపీకి కేంద్ర మంత్రి మండలిలో చోటు కల్పిస్తామని ప్రతిపాదించగా, మిగిలిన వారికి కీలకమైన సంస్థాగత, రాజకీయ బాధ్యతలు అప్పగిస్తామని హామీ ఇచ్చినట్లు తెలుస్తున్నది.