లక్నో : ఉత్తరప్రదేశ్ అయోధ్యలో ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో ముగ్గురు మహిళలు సహా ఏడుగురు మృత్యువాతపడ్డారు. ప్రమాదంలో మరో తొమ్మిది మంది తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బహ్రైచ్ – లఖింపూర్ హైవేపే ఆదివారం ఉదయం టూరిస్ట్ బస్ను ట్రక్కు ఢీకొట్టింది. కర్నాటక నుంచి 16 మందితో బస్సు అయోధ్య వెళ్తున్న సమయంలో మోతీపూర్ ప్రాంతంలోని నానిహా మార్కెట్ వద్ద ట్రక్కు అదుపు తప్పి వచ్చి ఢీకొట్టిందని అదనపు పోలీస్ సూపరింటెండెంట్ అశోక్ కుమార్ తెలిపారు.
బస్ డ్రైవర్తో సహా ఐదుగురు అక్కడికక్కడే మరణించగా, మరో ఇద్దరు ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మరణించారు. తొమ్మిది మంది తీవ్రంగా గాయాలకు గురయ్యారని, ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు పేర్కొన్నారు. ఘటన అనంతరం ట్రక్కు డ్రైవర్ పరారయ్యాడనీ తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఇదిలా ఉండగా.. ఘటనపై యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు వైద్యం అందించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.