సిమ్లా : ఏడాది చివరిలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న హిమాచల్ ప్రదేశ్లో ఆమ్ ఆద్మీ పార్టీకి (ఆప్) గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు అనూప్ కేసరి, ప్రధాన కార్యదర్శి సతీష్ ఠాకూర్, ఉనా జిల్లా చీఫ్ ఇక్బాల్ సింగ్ ఢిల్లీలో కాషాయ జెండా కప్పుకున్నారు.
బీజేపీలో చేరిక సందర్భంగా ఆప్ నేతలు ఢిల్లీ సీఎం, ఆ పార్టీ అధిపతి అరవింద్ కేజ్రీవాల్పై విమర్శలు గుప్పించారు. ఉనాకు చెందిన అనూప్ కేసరి వృత్తిరీత్యా న్యాయవాది. 2013లో ఆప్లో చేరిన కేసరి డిసెంబర్ 2020లో హిమాచల్ ప్రదేశ్ ఆప్ చీఫ్గా ఎంపికయ్యారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆప్ అగ్రనేతలు బీజేపీలో చేరడంతో కాషాయ శ్రేణుల్లో ఉత్తేజం నెలకొంది.
మరోవైపు హిమాచల్ ప్రదేశ్ సీఎం జైరాం ఠాకూర్ నియోజకవర్గం నుంచి ఇద్దరు బీజేపీ నేతలు ఆప్లో చేరడం కాషాయ శిబిరంలో కలకలం రేపింది. ఇక హిమాచల్ ప్రదేశ్లో బీజేపీ, కాంగ్రెస్ల మధ్య ద్విముఖ పోరు జరగనుండగా పంజాబ్ ఎన్నికల్లో గెలిచిన ఊపుతో హిమాచల్లోనూ సత్తా చాటాలని ఆప్ వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది.