భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమణ ఆవేదన
జడ్జీల సంఖ్య పెంచడం తక్షణావసరమని వెల్లడి
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 26: దేశ న్యాయవ్యవస్థ మౌలికవసతుల్లో కనీస ప్రమాణాలు కొరవడ్డాయని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ విచారం వ్యక్తం చేశారు. మేధో హక్కుల వివాదాలను సమర్థంగా పరిష్కరించేందుకు ఉన్నత న్యాయస్థానాల్లోని ఖాళీలు భర్తీ చేయడంతో పాటుగా న్యాయమూర్తుల సంఖ్య పెంచడం తక్షణావసరమని అన్నారు. భారత్లో మేధోహక్కుల వివాదాలకు న్యాయపరిష్కారం అనే అంశంపై జరిగిన జాతీయ సదస్సులో జస్టిస్ రమణ ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. న్యాయవ్యవస్థ మౌలిక వసతులు మెరుగుపర్చాల్సి ఉందని అన్నారు. దురదృష్టవశాత్తూ మన కోర్టుల్లో కనీస వసతులు కొరవడ్డాయని అన్నారు. న్యాయవ్యవస్థ మౌలిక వసతుల మెరుగుదలను సమన్వయపర్చే, పర్యవేక్షించే సంస్థాగత యంత్రాంగం ఏర్పాటుకు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ప్రయత్నిస్తూనే ఉన్నానని చెప్పారు. ‘కేవలం నిధులు కేటాయిస్తే సరిపోదు. ఉన్న నిధులను గరిష్ఠమైన రీతిలో ఉపయోగించుకోవాలి. కేంద్ర, రాష్ట్ర స్థాయిల్లో ఇందుకు అధికారులను నియమించాలని ప్రభుత్వానికి సూచించాను. త్వరలో సానుకూల స్పందన వస్తుందని ఆశిస్తున్నా’ అన్నారు.
దేశం నలుమూలల నుంచి అనేకమంది జడ్జీలతో పాటుగా కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఈ సదస్సుకు హాజరయ్యారు. దేశాభివృద్ధిలో మేధోహక్కులు కీలకపాత్ర పోషిస్తాయని జస్టిస్ రమణ నొక్కిచెప్పారు. భారత న్యాయ వ్యవస్థ ఇక్కడ పెట్టుబడులు పెట్టేవారికి సానుకూలంగా ఉంటుందని స్పష్టం చేశారు. విదేశాలకు వెళ్లినప్పుడల్లా ఈ ప్రశ్న తన చెవిన పడినట్టు గుర్తు చేసుకున్నారు. మన న్యాయవ్యవస్థ అందరికీ న్యాయం చేసేందుకు అవసరమైన స్వతంత్ర ప్రతిపత్తిని కలిగి ఉన్నదని చెప్పేవాడినని అన్నారు. కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ, స్టార్టప్లకు మేధోహక్కుల పరిరక్షణ కల్పించి ప్రోత్సాహం అందిస్తున్నామని చెప్పారు. గత ఏడాది 28,000 పేటెంట్లు నమోదయ్యాయని వివరించారు. మేధో హక్కులనేవి వ్యాపారానికి మాత్రమే పరిమితం కాదని, వాటిల్ ప్రజాప్రయోజనాలు ఇమిడి ఉంటాయని ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీఎన్ పటేల్ తన స్వాగతోపన్యాసంలో పేర్కొన్నారు. మేధో హక్కుల వివాదాలపై ఢిల్లీ హైకోర్టులో ఇద్దరు న్యాయమూర్తులతో కమిటీ వేసినట్టు వెల్లడించారు.