Karnataka assembly Elections | బెంగళూరు, ఏప్రిల్ 16 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల వేళ అధికార బీజేపీకి వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఇప్పటికే పలువురు సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సీనియర్ నేతలు కమలానికి రాజీనామా చేసి ఇతర పార్టీల్లో చేరిపోగా, తాజాగా మాజీ సీఎం, సీనియర్ నేత జగదీశ్ శెట్టర్ ఆదివారం తన ఎమ్మెల్యే పదవికి, బీజేపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈయన కాంగ్రెస్లో చేరేందుకు సిద్ధమయ్యారు. ఉత్తర కర్ణాటకకు చెందిన లింగాయత్ నేతల్లో అత్యంత ప్రముఖుడైన శెట్టర్ రాజీనామా బీజేపీకి ఎన్నికల్లో దెబ్బేనని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. హుబ్లీ-ధార్వాడ సెంట్రల్ అసెంబ్లీ నియోజకవర్గ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న శెట్టర్కు మళ్లీ టికెట్ ఇచ్చేందుకు బీజేపీ నిరాకరించింది. ఆదివారం ఉదయం స్పీకర్ విశ్వేశ్వేర్ హెగ్డేను కలిసి రాజీనామా పత్రం సమర్పించిన అనంతరం శెట్టర్ మీడియాతో మాట్లాడారు. తనకు టికెట్ రాకుండా కొంత మంది కుట్రలు చేశారని ఆరోపించారు. లింగాయత్ నాయకుల అణచివేత
‘లింగాయత్ల ఓట్లు కావాలి. వారి నాయకులు మాత్రం వద్దు. ఇదే ప్రస్తుతం బీజేపీ తీరు. లింగాయత్ నాయకులను కావాలనే వ్యూహాత్మకంగా అణచివేస్తున్నారు. యెడియూరప్ప, లక్ష్మణ్ సవది.. ఇప్పుడు నా వంతు’ అని శెట్టర్ మండిపడ్డారు. సీఎం పదవికి పోటీ పడే అవకాశాలున్న నేతలను అడ్డు తొలగించకునేందుకు ఇలా చేస్తున్నారని ఆరోపించారు. తాను ఏ తప్పు చేయలేదని, అవినీతికి పాల్పడలేదని, సీబీఐ, ఈడీ, ఐటీ వంటి దర్యాప్తు సంస్థల దాడులకు భయపడేది లేదన్నారు.
శెట్టర్ కాంగ్రెస్లోకి వెళ్లే అవకాశాలున్నాయి. ఆయన వియ్యంకుడు, కాంగ్రెస్ నేత శ్యామనూరు శివశంకరప్ప దీనిపై పార్టీ నాయకత్వంతో మంతనాలు సాగిస్తున్నారు. శెట్టర్ తమ పార్టీలోకి వస్తే స్వాగతిస్తామని ఇప్పటికే పలువురు కాంగ్రెస్ నేతలు ప్రకటించారు. మాజీ మంత్రి మాలక రెడ్డి (యాదగిరి) జేడీఎస్లో చేరారు. మరో మాజీ మంత్రి బీ సోమశేఖర్ (మళవళ్లి) బీజేపీకి రాజీనామా చేశారు. కొప్పల్ ఎంపీ కరడి సంగణ్ణ రాజీనామా యోచనలో ఉన్నట్టు సమాచారం.
బీదర్ జిల్లాలో ఎన్నికల వాతావరణం వేడెక్కింది. కాంగ్రెస్కు పట్టు ఉన్న బీదర్ జిల్లాలో పాగా వేసేందుకు బీజేపీ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నది. బీదర్లో ఆరు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. హుమ్నాబాద్లో పోటీచేస్తున్న కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్యే రాజశేఖర్ పాటిల్, బీజేపీ అభ్యర్థి సిద్దుపాటిల్ సమీప బంధువులు కావడంతో ఓటర్లు ఎవరి వైపు మొగ్గు చూపుతారోననే ఆసక్తి నెలకొన్నది. బాల్కి లో కాంగ్రెస్, బీజేపీ మధ్య పోటాపోటీ ఉన్నదని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. అసెంబ్లీ ఎన్నికలకు నామినేషన్లు ఈనెల 13 నుంచి ప్రారంభం కావడంతో సోమవారం నామినేషన్లు వేసేందుకు ప్రధాన పార్టీల అభ్యర్థులు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.