(స్పెషల్టాస్క్ బ్యూరో నమస్తే తెలంగాణ) ;వామ్మో.. డిప్యూటేషన్పై కేంద్రానికా? అంటూ పెదవి విరుస్తున్నారు పలువురు ఐఏఎస్ అధికారులు. గత ఐదేండ్ల గణాంకాలు ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. గతంలో సీనియర్ ఐఏఎస్ అధికారులు కేంద్ర విభాగాల్లో పనిచేయడానికి ఆసక్తిచూపేవారు. అక్కడ పనిచేస్తే వృత్తి నైపుణ్యాలు పెరుగుతాయని భావించేవారు. కానీ, ఇప్పుడు పరిస్థితి మారింది. వివిధ రాష్ర్టాల క్యాడర్లో పనిచేస్తున్న ఐఏఎస్లు డిప్యూటేషన్పై కేంద్ర ప్రభుత్వ విభాగాలకు వెళ్లేందుకు ఏమాత్రం ఆసక్తి చూపడం లేదు. నిజానికి ఐఏఎస్లు కేంద్ర విభాగాల్లో పనిచేసేందుకు ప్రతి రాష్ర్టానికి కోటా ఉంటుంది. రాష్ట్రంలోని సీనియర్ డ్యూటీ పోస్టుల ఆధారంగా దీనిని నిర్ణయిస్తారు. ఆ సీనియర్ పోస్టుల్లో 40% ఐఏఎస్ అధికారులు డిప్యూటేషన్పై కేంద్రానికి వెళ్లే అవకాశం ఉంటుంది. కానీ ప్రస్తుతం అందులో మూడో వంతు కూడా అటువైపు చూడటం లేదు. కేంద్రం విధానం, పెద్దల ఒత్తిడి, స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోలేని పరిస్థితులే ఇందుకు కారణమని తెలుస్తున్నది.
డిప్యూటేషన్కు అవకాశం ఉన్నా..
వివిధ రాష్ర్టాల నుంచి 2017లో 99 మంది ఐఏఎస్ అధికారులకు డిప్యూటేషన్పై వెళ్లేందుకు అవకాశం ఉన్నప్పటికీ 85 మంది మాత్రమే వెళ్లారు. 2018లో డిప్యూటేషన్పై వెళ్లినవారి సంఖ్య 71కి పడిపోయింది. గత ఏడాది పరిస్థితి మరీ దిగజారింది. 2021లో డిప్యూటేషన్ కోటా 124 కాగా వెళ్లినవారి సంఖ్య 71కి కుదించుకుపోయింది. దీంతో 53 పోస్టులు ఖాళీగా ఉండిపోయాయి. గత ఐదేండ్లలో మొత్తంగా 563 మందికి డిప్యూటేషన్ వెళ్లేందుకు అవకాశం ఉన్నా 397 మంది మాత్రమే ఆసక్తి చూపించారు.
సొంత రాష్ర్టాలకు తిరుగుముఖం
డిప్యూటేషన్ కాల పరిమితి పూర్తి కాకుండానే పలువురు ఐఏఎస్లు తమ రాష్ర్టాలకు తిరుగుముఖం పడుతుండటం గమనార్హం. గత ఐదేండ్లలో 147 మంది అధికారులు మధ్యలోనే రాష్ర్టాలకు తిరిగి వచ్చేయడం పరిస్థితి తీవ్రతను సూచిస్తున్నది. ఇందుకు ప్రమోషన్లు, వ్యక్తిగత, అడ్మినిస్ట్రేషన్ అంశాలు కారణమని పైకి చెప్తున్నా.. కేంద్రంలోని పెద్దల వైఖరి, వారితో సయోధ్య లేకపోవడం, అభిప్రాయ బేధాలే ఇందుకు దోహదం చేస్తున్నట్టు సమాచారం. వీటన్నింటికీ మించి కేంద్ర ప్రభుత్వం నిపుణుల పేరిట వివిధ విభాగాల్లో కొంతమందిని డైరెక్టర్, డిప్యూటీ సెక్రటరీ, జాయింట్ సెక్రటరీ హోదాల్లో నియమిస్తున్నది.
గత నాలుగేండ్లలో 37 మందిని ఇలా దొడ్డిదారిన నియమించింది. ఇది ఐఏఎస్ల్లో అసంతృప్తికి కారణమని తెలుస్తున్నది. రాష్ర్టాల్లో స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకొనే అవకాశం ఉంటుందని, సమస్యలు పరిష్కరించామన్న సంతృప్తి మిగులుతుందని, కానీ కేంద్రంలో అలా ఉండదని చెప్తున్నారు. అక్కడ పైవారి ఆదేశాలకు అనుగుణంగా పనిచేయాల్సి ఉంటుందని డిప్యూటేషన్పై పనిచేసి తిరిగి వచ్చిన పలువురు ఐఏఎస్లు అభిప్రాయపడుతున్నారు. కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో ఢిల్లీలో పనిచేసి అనుభవం గడించాలని ఆశపడే యువ ఐఏఎస్ అధికారులకు వాస్తవ పరిస్థితులు ఆందోళన కలిగిస్తున్నాయి.