బెంగళూరు, ఆగస్టు 16: హైదరాబాద్ నుంచి బెంగళూరుకు రైళ్లో చేరుకోవాలంటే ప్రస్తుతం 10-12 గంటల సమయం పడుతుంది. అయితే త్వరలో ఈ సమయం రెండున్నర గంటలకు తగ్గనున్నది. ఐటీ కేంద్రాలుగా పిలుస్తున్న ఈ రెండు నగరాల మధ్య సెమీ-హైస్పీడ్ రైల్వే ట్రాక్ను నిర్మించాలన్న యోచనలో రైల్వేశాఖ ఉన్నది. పీఎం గతిశక్తి పథకం కింద సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి బెంగళూరులోని యలహంక స్టేషన్ వరకూ 503 కిలోమీటర్ల మేర ఈ ట్రాక్ను నిర్మించే ప్రతిపాదనలు ఉన్నాయి.
దీని కోసం రూ.30 వేల కోట్లు వెచ్చించనున్నారు. ఈ మేరకు ‘ఇండియా ఇన్ఫ్రాహబ్’ ఓ నివేదికలో వెల్లడించింది. ఒకవేళ ఈ ట్రాక్ అందుబాటులోకి వస్తే గంటకు 200 కిలోమీటర్ల వేగంతో రైళ్లు ప్రయాణించే వీలు ఉంటుందని తెలిపింది. హైస్పీడ్ రైలు ప్రయాణానికి అడ్డంకులు ఎదురవ్వకుండా ట్రాక్కు ఇరువైపులా 1.5 మీటర్ల ఎత్తుతో ఫెన్సింగ్ వాల్ నిర్మించనున్నట్టు వెల్లడించింది. అయితే, దీనిపై అధికారిక ప్రకటన ఇంకా వెలువడలేదు.