Manish Sisodia : ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్టయ్యి తీహార్ జైల్లో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ సీనియర్ నాయకుడు మనీశ్ సిసోడియా ఢిల్లీ ప్రజలను ఉద్దేశించి జైలు నుంచి ఒక లేఖ రాశారు. ‘త్వరలో మిమ్ములందరినీ బయటికొచ్చి కలుస్తా’ అని ఆయన తన లేఖలో పేర్కొన్నారు. అదేవిధంగా అనారోగ్యంతో ఉన్న తన భార్యను జాగ్రత్తగా చూసుకుంటున్న తన ప్రతాప్గంజ్ నియోజకవర్గ ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
కాగా, తీహార్ జైలు నుంచి మనీష్ సిసోడియా ఢిల్లీ ప్రజలను ఉద్దేశించి లేఖ రాయడం ఇది రెండోసారి. ఇటీవల హిందీలో రాసిన ఈ రెండో లేఖ శుక్రవారం సోషల్ మీడియాలో చక్కెర్లు కొడుతోంది. బ్రిటిషర్ల కాలంలో స్వాతంత్య్రం కోసం పోరాడిన వాళ్లు జైలుపాలైనట్టే ఇప్పుడు తాను జైలుపాలయ్యానని లేఖలో ఆయన రాశారు. గత ఏడాదికాలంగా నేను మీతో ఎడబాటును భరిస్తున్నానని రాసుకొచ్చారు.
‘మిమ్ములందరినీ బయటికొచ్చి కలుస్తా. విద్యా విప్లవం చిరకాలం కొనసాగుతుంది. మిమ్మల్ని అందరినీ ప్రేమిస్తున్నా. గడిచినా ఏడాది కాలంగా నేను మీ అందరిని మిస్సవుతున్నా. అయినా ప్రతి ఒక్కరినీ గుర్తుపెట్టుకున్నా. అందరూ కలిసికట్టుగా నిజాయితీగా పనిచేశారు. మనం మంచి విద్య కోసం పోరాడుతున్నాం. ఏళ్ల పోరాటం తర్వాత దేశానికి స్వాతంత్య్రం వచ్చినట్టే ఏదో ఒకరోజు ప్రతి బిడ్డ మంచి విద్యను పొందుతారు’ అని సిసోడియా తన లేఖలో పేర్కొన్నారు.
కేంద్రంలోని బీజేపీ సర్కారును సిసోడియా బ్రిటిష్ పాలకులతో పోల్చారు. మహాత్మాగాంధీ, నెల్సన్ మండేలా లాంటి నాయకులు తనకు ఆదర్శమని చెప్పారు. ‘నాడు బ్రిటిషర్లు కూడా అధికారాన్ని చూసుకుని విర్రవీగారు. ఎదురించిన నేతలను జైల్లో పెట్టారు. మహాత్మాగాంధీని ఏళ్ల తరబడి జైలుపాలు చేశారు. నెల్సన్ మండేలా కూడా జైలుకు వెళ్లాడు. వీరంతా నాకు ఆదర్శం. మీరే నా బలం’ అని లేఖలో రాశారు.