ముంబై: కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కోరలు చాస్తున్న నేపథ్యంలో మహారాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమయింది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో ఇప్పటికే న్యూయిర్ వేడుకలపై మున్సిపల్ కార్పొరేషన్ నిషేధం విధించింది. వైరస్ వ్యాప్తిని నిలువరించడానికి మహానగరంలో పోలీసులు నేటి నుంచి 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. ఈ ఆంక్షలు వచ్చే నెల 7 వరకు అమల్లో ఉంటాయని వెల్లడించారు. ఈ నేపథ్యంలో ప్రజలు కొత్త సంవత్సర వేడుకలకు దూరంగా ఉండాలని, బహిరంగ ప్రదేశాలతోపాటు హోటళ్లు, బార్లు, పబ్బులు, రిసార్టులు, క్లబ్లలో ఎలాంటి వేడుకలు నిర్వహించుకోవడానికి వీళ్లేదని స్పష్టంచేశారు. నిబంధనలు అతిక్రమిస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
మహారాష్ట్రలో బుధవారం 3900 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇందులో 85 ఒమిక్రాన్ బాధితులు కూడా ఉన్నారు. ముంబైలో నిన్న ఒక్కరోజే 2445 మంది కరోనా బారినపడ్డారు. అంతకుముందు రోజు పట్టణంలో 1333 కేసులు మాత్రమే నమోదయ్యాయి. అంటే ఒక్కరోజు వ్యవధిలోనే 83 శాతం కేసులు అధికమయ్యాయి.