ముంబై: కరోనా నేపథ్యంలో వినాయక చవితి ఉత్సవాలపై మహారాష్ట్ర ప్రభుత్వం ఆంక్షలు విధించింది. మహమ్మారి వ్యాప్తిని నిలువరించడానికి దేశ ఆర్థిక రాజధాని ముంబైలో ఈనెల 19 వరకు 144 సెక్షన్ అమలు చేస్తున్నది. మహానగరంలో బహిరంగ ఉత్సవాలు, ఊరేగింపులపై నిషేధం విధించింది. వీధుల్లో ఐదుగురికంటే గుమికూడటానికి వీల్లేదని పోలీసులు ప్రకటించారు. భక్తులు కూడా గణేశుని మంటపాలను దర్శించకూడదని స్పష్టం చేశారు. గణనాథుడిని ఆన్లైన్, ఎలక్ట్రానిక్ మీడియాలోనే దర్శించుకోవాలని సూచించారు. ఈమేరకు ముంబై డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఆదేశాలు జారీచేశారు.
ఇక ఉత్తరప్రదేశ్లో కూడా బహిరంగ ప్రదేశాల్లో వినాయక విగ్రహాల ఏర్పాటుపై ప్రభుత్వం నిషేధం విధించింది. అదేవిధంగా తమిళనాడులో పండుగలు, మతపరమైన కార్యక్రమాలపై నిషేధం అమల్లో ఉన్నది. ఢిల్లీలో గణేశ్ ఉత్సవాలను బహిరంగంగా నిర్వహించొద్దని ఆదేశాలు జారీచేశారు.