హైదరాబాద్ : వంట నూనె ధరలపై సెకండ్ వేవ్ ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. దేశంలో ద్రవ్యోల్బణం పెరగడంతో భారతీయ గృహాల్లో వంట చేసుకునేందుకు వినియోగించే ఆహార పదార్థాలు, ముఖ్యంగా వంట నూనె ధరలు చుక్కల్నితాకాయి. దీంతో వినియోగదారులు నిత్యావసర వస్తువులు, ఆహారం, వంట నూనె ధరల భారాన్ని బలవంతంగా మోయాల్సి వస్తోంది. కొవిడ్ థర్డ్ వేవ్ వస్తే ఈ ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది. ప్రపంచంలోనే అత్యధికంగా వంట నూనెను వినియోగించే దేశాల్లో భారతదేశం మొదటి స్థానంలో ఉంది. పామ్ ఆయిల్ను అధిక మొత్తంలో విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటుండగా, ఆ తర్వాత స్థానాల్లో సోయాబీన్, సన్ ఫ్లవర్ నూనె దిగుమతి అవుతున్నాయి.
భారతదేశంలో పామాయిల్లో 94.1 శాతం వంటకు వినియోగిస్తున్నారు. రిటైల్ మార్కెట్లో వంట నూనెల ధరలను తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం పామాయిల్పై కస్టమ్స్ సుంకాన్నితగ్గించింది. అది 30 జూన్ నుంచి 30 సెప్టెంబరు 2021 వరకు 35.75 శాతం నుంచి 30.25 శాతానికి రిఫైన్డ్ పామాయిల్పై 49.5 శాతం నుంచి 41.25 శాతానికి తగ్గించింది. ఐనప్పటికీ ఈ ప్రకటన తర్వాత ఆయిల్ ధరలు 6శాతంపైగా పెరిగాయి. పామాయిల్ ధరల పెరుగుదలతో ఇప్పటికే ఎదుర్కొంటున్న ఆహారం, ఇంధన ద్రవ్యోల్బణం భారతీయ ఆర్థిక వ్యవస్థ పై అదనపు భారాన్నిమోపింది.
వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, పౌర సరఫరాల శాఖ అధికారిక నివేదిక ప్రకారం పామాయిల్ ప్యాకెట్ సగటు రిటైల్ ధర 2021 మేలో కిలోకు రూ.131.69 రూపాయలు ఉంది. ఇది గత 11 ఏళ్లలో లోనే ఎక్కువ. నిరుడు కిలో ధర రూ.88.27తో పోలిస్తే 49 శాతం పెరిగింది.ఆహార పదార్థాలను తయారు చేసే కంపెనీలు ఇప్పుడు పెరుగుతున్న పామాయిల్ ధరల భారాన్ని తాము మోయలేక, తమ ఉత్పత్తుల ధరలను పెంచాలని చూస్తున్నాయి. అంటే, రానున్న పండగ సీజన్ వినియోగదారులు ఖర్చుకు భయపడి, ఆహార పదార్థాలను కొనుగోలు చేయడానికి కాస్త వెనకదోచు దీని ప్రభావంతో ఆర్థిక వ్యవస్థ మందకొడిగా ఉండే అవకాశం ఉంది.
పండుగ వేడుకల్లో ఇంటికి అవసరమైన కీలకపదార్థాల్లో పంచదార, పాలు ,మిఠాయిల తయారీకి నూనె అవసరం అవుతుంది. గత రెండు నెలల్లో పాల ధరలు ఇప్పటికే లీటరుకు రూ.3-4 వరకు పెరిగాయి. ప్రపంచంలో అత్యధికంగా చక్కెర ఎగుమతి చేసే బ్రెజిల్, ఇప్పుడు తక్కువ ఉత్పత్తి చేయడంతో చక్కెర ధరలు మరింతగా పెరిగాయి. వినియోగదారులు లీటర్ ఆయిల్కు రూ.24 దిగుమతి సుంకాన్ని చెల్లిస్తున్నారు. ఇది కూడా దిగుమతి సుంకాల తగ్గింపు ఫలితమే. రానున్న 6 నుంచి 9 నెలల వరకు సుంకాలు ప్రభుత్వం మరింతగా తగ్గించేందుకు ఒక నిర్ణయాన్ని తీసుకునే అవకాశం ఉంది. అమెరికా, యూరప్లో కొవిడ్ అనంతరం సరఫరా తక్కువ, డిమాండ్ ఎక్కువ కావడంతో అంతర్జాతీయ మార్కెట్లలో ధరలు ఎక్కువగానే ఉంటాయని నిపుణులు అంచనా వేస్తున్నారు.