న్యూఢిల్లీ, మార్చి 8: పార్లమెంట్ మలి విడత బడ్జెట్ సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కాబోతున్నాయి. నేటి అజెండా ప్రకారం, స్పీకర్ ఓం బిర్లాపై విపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం లోక్సభ వ్యవహారాల్లో లిస్ట్ చేసిన ఏకైక అంశంగా ఉంది. దీంతో అధికార బీజేపీ, విపక్ష కాంగ్రెస్ రెండూ విప్ జారీచేశాయి. టీఎంసీ కూడా బిర్లాకు వ్యతిరేకంగా తీర్మానానికి మద్దతు తెలుపుతున్నది. దీంతో బడ్జెట్ సమావేశాల రెండవ భాగం.. వాడీవేడిగా జరిగేందుకు రంగం సిద్ధమైంది. స్పీకర్పై అవిశ్వాస తీర్మానంతో పాటు, ఇరాన్పై యుద్ధం, పశ్చిమాసియాలో పెరుగుతున్న ఉద్రిక్తతలు, ధరల పెరుగుదలకు దారితీసే అంశాలు, రష్యా నుంచి చమురు కొనుగోలుకు ట్రంప్ ‘అనుమతి’.. తదితర అంశాలు చర్చకు రానున్నాయి. మోదీ సర్కార్ వైఖరిని ప్రశ్నించాలని ప్రతిపక్షాలు భావిస్తున్నాయి. టీఎంసీ సభ్యులు సభలో ‘సర్’ అంశాన్ని లేవనెత్తితే.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రొటోకాల్ ఉల్లంఘన అంశాన్ని బీజేపీ లేవనెత్తవచ్చు. బడ్జెట్ సమావేశాల్లో సమయం మిగిలితే విద్యుత్తు సవరణ బిల్లును కేంద్రం ప్రవేశపెట్టవచ్చు.