పూంచ్: జమ్ముకశ్మీర్లోని పూంచ్ (Poonch) జిల్లాలో ముష్కరుల కోసం గాలింపు కొనసాగుతున్నది. శుక్రవారం సాయంత్రం ఖనేటర్ ప్రాంతంలో వెళ్తున్న ఆర్మీ కాన్వాయ్పై ఉగ్రవాదులు రెండు రౌండ్లు కాల్పులు జరిపిన విషయం తెలిసిందే. ప్రతిగా సైనికులు కాల్పులు జరపడంతో ఉగ్రవాదులు అక్కడి నుంచి పరారయ్యారు. దీంతో కశ్మీర్ పోలీసులతో కలిసి భారత సైన్యం ఆ ప్రాంతాన్ని జల్లడపడుతున్నది. ఆ మార్గం గుండా వెళ్తున్న ప్రతీ వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు.
శుక్రవారం సాయంత్రం 6.20 గంటలకు పూంచ్ సెక్టార్లోని కృష్ణఘాటి (Krishna Ghati) సమీపంలో జవాన్లు వెళ్తున్న వాహనాలపై ఉగ్రవాదులు (Terrorists) కాల్పులు జరిపారు. అప్రమత్తమైన జవాన్లు వారి దాడుల్ని తిప్పికొట్టారు. ఆ కాన్వాయ్లో దారాధుల్లియా ఖ్వాడియా ప్రాంత ఆర్మీ కాన్వాయ్, లోకల్ రాష్ట్రీయ రైఫిల్స్ యూనిట్ కమాండ్ ఆఫీసర్ కూడా ఉన్నారు. రాజౌరీ, పూంజ్ జిల్లాల్లో ఉగ్రవాదుల శిబరాలను నిర్మూలించాలని అంతకుముందు జరిగిన భద్రతా బలగాల సమావేశంలో నార్త్రర్న్ ఆర్మీ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ ఉపేంద్ర ద్వివేది చెప్పారు. ఈ సమావేశం ముగిసిన కొద్ది సేపటికే ఉగ్రదాడి జరుగడం గమనార్హం. డిసెంబర్ 21న పూంచ్ జిల్లాలోని ధాత్యార్ మోర్హ్ ప్రాంతంలో ఉన్న మూలమలుపు వద్ద ఆర్మీ వాహనాలపై ఉగ్రవాదులు కాల్పులు జరిపిన విషయం తెలిసిందే. దీంతో నలుగురు జవాన్లు మరణించగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.
#WATCH | J&K: Vehicles being checked as security heightened in Poonch after suspected terrorists fired upon a Security Forces convoy of vehicles.
(Visuals deferred by unspecified time) https://t.co/E5Gtv995lv pic.twitter.com/lhoo4QHt6t
— ANI (@ANI) January 12, 2024