Anurag thakur | న్యూఢిల్లీ: బీజేపీ ఎంపీ, రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్భూషణ్ లైంగిక వేధింపులపై తాము చేస్తున్న నిరసనను తొక్కిపెట్టేందుకు కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ కుట్ర చేశారని రెజ్లర్ వినేశ్ ఫొగట్ తెలిపారు. బ్రిజ్భూషణ్కు వ్యతిరేకంగా చర్యలు తీసుకోవాల్సింది పోయి, విచారణ కమిటీ అంటూ కాలయాపన చేసేందుకు ప్రయత్నించారని వెల్లడించారు. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద రెజ్లర్ల ఆందోళన బుధవారం కూడా కొనసాగింది.
ఈ సందర్భంగా వినేశ్ ఫొగట్ మాట్లాడుతూ.. జంతర్మంతర్ వద్ద ఆందోళన ప్రారంభించే 4 నెలల ముందు ఓ ఉన్నతాధికారిని కలిశామని, మహిళా అథ్లెట్లు ఏ విధంగా లైంగిక వేధింపులు, మానసిక హింసకు గురయ్యారో పూసగుచ్చి వివరించామని.. అయినా ఎటువంటి చర్యలు తీసుకోలేదని తెలిపారు. అందుకే తాము ధర్నాకు దిగాల్సి వచ్చిందన్నారు. ఒలింపిక్స్ సెలక్షన్కు ప్రవేశపెట్టిన కొత్త రూల్స్కు వ్యతిరేకంగా రెజ్లర్లు ఆందోళన చేస్తున్నారన్న బ్రిజ్భూషణ్ వ్యాఖ్యలను భజరంగ్ పునియా కొట్టిపారేశారు. కాగా, రెజ్లర్ల ఆందోళనకు ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ (ఐఓఏ) అధ్యక్షురాలు పీటీ ఉష ఎట్టకేలకు మద్దతు తెలిపారు. జంతర్ మంతర్ వద్ద రెజ్లర్లను కలిసి మాట్లాడారు.