వారణాసి, డిసెంబర్ 18: ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో ఉన్న జ్ఞానవాపీ మసీదులో శాస్త్రీయ సర్వే పూర్తి చేసిన ఆర్కియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా(ఏఎస్ఐ) స్థానిక జిల్లా కోర్టుకు సోమవారం సీల్డ్ కవర్లో నివేదిక సమర్పించింది. ఈ కేసులో తదుపరి విచారణను కోర్టు ఈ నెల 21కు షెడ్యూల్ చేసింది. ఈ నేపథ్యంలో ఏఎస్ఐ నివేదికలో ఏముందనేది ఆసక్తికరంగా మారింది. ఈ నెల 21న న్యాయస్థానం నివేదికను తెరుస్తుందని, రెండు పక్షాల న్యాయవాదులకు దాని కాపీలు అందజేస్తుందని హిందూ పిటిషనర్ల తరపు న్యాయవాది మదన్ మోహన్ యాదవ్ తెలిపారు. అయితే నివేదికను బహిరంగపర్చొద్దని ముస్లిం తరపు నుంచి పిటిషన్ వేశారని, అయితే నివేదికను బహిర్గతం చేయాలని తాము కౌంటర్ వాదనలు వినిపించామని పేర్కొన్నారు. వారణాసిలో కాశీ విశ్వనాథుడి ఆలయం పక్కనే ఈ జ్ఞానవాసీ మసీదు కాంప్లెక్స్ ఉంటుంది. అయితే అంతకుముందు ఉన్న ఆలయంపై 17వ శతాబ్దంలో ఈ జ్ఞానవాసీ మసీదును నిర్మించారని ఆరోపిస్తూ వారణాసి కోర్టులో పలువురు పిటిషన్లు వేశారు. ఈ నేపథ్యంలో ఈ అంశాన్ని తేల్చేందుకు మసీదు ప్రాంగణంలో శాస్త్రీయ సర్వే నిర్వహించాలని వారణాసి జిల్లా కోర్టు ఈ ఏడాది జూలై 21న ఆదేశించింది.