1993 మే 5న శాంతి నికేతన్లోని ఆమ్ర-కుంజ్లో విశ్వభారతి విశ్వవిద్యాలయంలో ప్రధాని పీవీ ప్రసంగం
ఈ విశ్వవిద్యాలయ ఆచార్య పదవి స్వీకరించిన తర్వాత మొదటి స్నాతకోత్సవంలో నేను విశ్వభారతి ప్రాతినిధ్యం వహిస్తున్న విలువల గురించి చెప్పాను.
జనక, యాజ్ఞవల్క్య, సత్యకామ, అరుణి వంటి రుషులు మొదలుకొని ఈ విశ్వవిద్యాలయ స్థాపకుడు రవీంద్రనాథ్ ఠాగోర్ వరకు మన నాగరికతకు, వ్యవస్థలకు నిరంతర స్ఫూర్తినివ్వడాన్ని గమనించవచ్చు. ఈ కాలంలో మనం నాటి స్ఫూర్తిని పొందడం అవసరం. ఈ కాలంలో కొన్ని సిద్ధాంతాలు అన్ని సమస్యలకు అంతిమ పరిష్కారాన్ని ఇస్తాయనే భ్రమ కలిగిస్తూ మూఢతాన్ని, అసహనాన్ని సృష్టిస్తున్నాయి. ఈ వైఖరి నుంచి భారతీయుల మస్తిష్కాన్ని కాపాడి వారిని స్వేచ్ఛగా, నిబ్బరంగా ఉండనివ్వాలి. ఈ సమవర్తన సందర్భంగా గురుదేవ్ రవీంద్ర ఠాగోర్ వేదాల నుంచి స్వీకరించిన సందేశాన్ని గుర్తుచేసుకుందాం.
‘సత్యాన్న ప్రమదితవ్యం/ ధర్మాన్న ప్రమదితవ్యం/ కుశలాన్న ప్రమదితవ్యం’.. మన విలువల్ని కాపాడుకోవడమే కాదు, వాటిని కార్యాచరణలోకి మార్చాలి. అందుకే ఇలా ప్రబోధించారు- ‘ధాన్యవధాని కర్మాణి/ తాని సేవిత్వయాని నో ఇతరాని/ ధాన్యస్మాకము సుచరితాని/ తాని తతోపశ్యాని నో ఇతరాని’. మన ప్రవర్తనలో దుష్టమార్గాన్ని చేపట్టకుండా, ధర్మమార్గాన్ని అనుసరించాలనడమే వారి ఉద్దేశం. యుగయుగాలుగా వస్తున్న ఇలాంటి వేద మం త్రాలు ఈ విశ్వవిద్యాలయ ఆవరణలోని వృక్షాల నీడన యువతను ప్రభావితం చేస్తాయని నమ్ముతున్నాను.
యువత శక్తిసామర్థ్యాలను జాతి ప్రయోజనాల కోసం ఉపయోగించేందుకు ఎందరో చింతనాపరులు ప్రయత్నించారు. వీరిలో మహాత్మాగాంధీ, రవీంద్రనాథ్ ఠాగోర్ ప్రముఖులు. వీరు తమదైన రీతిలో (సబర్మతి, శాంతి నికేతన్) ఆశ్రమ విధానాన్ని అనుసరించడం యాదృచ్ఛికం కాదు. మన సమాజ సంప్రదాయ నాగరిక విధానంలో నూతన ఆవిష్కరణలను ప్రవేశపెట్టడానికి వారు ప్రయత్నించారు. ఠాగోర్ సామాజిక, జాతీయ సమస్యలకు విద్యాతత్తం ద్వారా పరిష్కారాలు సాధించ ప్రయత్నించారు. రవీంద్రుడు, ఆయన స్నేహితుడైన లియోనార్డ్ ఎల్మిహిర్స్ గ్రామీణ పునర్నిర్మాణానికి అవసరమైన కార్యాచరణను ముందుకుతెచ్చారు. ఇందుకు సంబంధించిన పరిశోధన, సంఘసేవ, వ్యవసాయరంగాలపై ప్రయోగాలు చేపట్టారు. గ్రామీణ పరిశ్రమల పునరుద్ధరణకు ప్రత్యేకించి ఖాదీ రంగంలో సబర్మతి ఆశ్రమంలో మహాత్మాగాంధీ అనుసరించిన విధానం కూడా ఇలాంటిదే. సంప్రదాయ పరిశ్రమలకు భిన్నంగా ఆధునీకరణ విషయమై ఇరువురు చింతనాపరులకు మధ్య తేడా ఉన్నప్పటికీ, వారు తమ ఆలోచనలకు కార్యరూపం ఇవ్వడానికి ఆశ్రమ విధానాన్ని ఎంచుకున్నారు. వనరులను అభివృద్ధి కోసం యువత ఎలా వినియోగించుకోవాలనేది వర్తమాన సమాజం, ఆర్థికవ్యవస్థ దృక్కోణంలో అర్థం చేసుకోవాలి. రవీంద్రుడు శాంతినికేతన్లో ప్రవేశపెట్టిన విద్యా తాత్త్వికతను అధ్యయనం చేయడం ద్వారా మనకు స్పష్టత వస్తుంది. ఈ చింతనాపరులు నెలకొల్పిన సంప్రదాయాలపై ఆధారపడి మనం కొత్త ఆలోచనా విధానాన్ని, కార్యాచరణను రూపొందించుకోవాలి.
మన సమాజాన్ని తీర్చిదిద్దడమనే లక్ష్యసాధన కోసం మానవ వనరుల అభివృద్ధిలో యువత ఏయే రంగాల్లో కీలకపాత్ర పోషించగలదు? యువత స్వచ్ఛంద సంస్థల ద్వారా నిరక్షరాస్యతను రూపుమాపాలి.
మూఢ నమ్మకాలను నిర్మూలించి శాస్త్రీయ దృక్పథం అలవరచాలి. ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం వంటి కార్యక్రమాల్లోనూ భాగస్వాములు కావచ్చు. యువత క్రియాశీ లపాత్ర పోషించడానికి విస్తృత అవకాశాలున్నాయి. అయితే నిధుల కొరత తీవ్రంగా ఉందనేది కాదనలేం. మన జాతీయ విధానంలో భాగంగా ఇందుకు నిధుల కొరత లేకుండా చూ డాలి. విద్య మీద దృష్టి కేంద్రీకరించాలి. విద్య ద్వారా మానవవనరుల అభివృద్ధి సాధ్యమవుతుంది. ఇది అంతిమంగా దేశాభివృద్ధికి దోహదపడుతుంది. జాతీయ అక్షరాస్యతా ఉద్యమం ద్వారా నిరక్షరాస్యత నిర్మూలనకు భారీ కార్యక్రమం చేపడుతుంది. విశ్వవిద్యాలయాలూ ఇందులో భాగస్వామ్యం పొందవచ్చు. ప్రజలు భారీ ఎ త్తున విద్యాభ్యాసంలో భాగస్వాములయ్యేందుకు పురికొల్పడం యువత బాధ్యత. అయితే విశ్వవిద్యాలయాలకు వనరుల కొరత ఉంటుంది. విద్యార్థులు, అధ్యాపకుల మధ్య, విశ్వవిద్యాలయాలకు, సమాజానికి మధ్య సంబంధాలు నెలకొల్పడం వ్యయంతో కూడుకున్నది. కానీ స్వల్పకాలిక శిక్షణ వంటి భిన్న అదనపు కార్యక్రమాలను చేపట్టడం ద్వారా సమాజంతో సంబంధాలను నెలకొల్పుకోవచ్చు. మన సంప్రదాయాలను విస్మరిస్తే మనం మూలాలు లేనివారమవుతాం. కనుక సంప్రదాయాల పునాదిపైనే ఆధునిక శాస్త్రీయ దృక్పథాన్ని అలవరచాలి. కులమతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టి, విచ్ఛిన్నానికి దారితీసే మూఢత్వ శక్తులను పారదోలాలి. యువత ఈ సవాలును స్వీకరించగలదని భావిస్తున్నాను.
ఐదేండ్ల కింది పరిజ్ఞానం ఇప్పుడు వెనుకబడిపోతున్నది. అందువల్ల వ్యవసాయరంగంలో ఆధునిక పరిజ్ఞానాన్ని దేశమంతటికీ విస్తరింపజేయవలసి ఉన్నది. తరగతి గదిలో, ప్రయోగశాలలో నేర్చుకున్నది సమాజానికి చేరాలి. ఈ క్రమంలో విద్యార్థుల అవగాహన కూడా విస్తృతమవుతుంది.
విశ్వభారతికి శంకుస్థాపన చేసినప్పుడు ఠాగోర్.. ‘మనం మన పాండిత్య బందీఖానాలో పడి ప్రపంచం నుంచి ఏకాకులుగా మారుతున్నాం. ఈ ఏకాకితనం నుంచి దేశానికి విముక్తి కలిగించడం అంత సులభంకాదు. ఇచ్చిపుచ్చుకునే ధోరణితో మనం ప్రపంచంతో సంబంధాలు నెలకొల్పుకోవాలి. ప్రపంచ అభ్యసనంలో మనం భాగస్వాములం కావాలి’ అని బోధించారు. ప్రాచ్య, పాశ్చాత్య సంస్కృతులకు, నాగరికతలకు విశ్వభారతి కూడలి కావాలని రవీంద్రుడు కోరుకున్నారు.
బ్రిటిష్ వారు పాలిస్తున్న, పాశ్చాత్యులు తమ రాజకీయ, మేధో ప్రాబల్యం కలిగి ఉన్న ఆ కాలంలో రవీంద్రుడు ఇటువంటి ప్రయత్నం చేయ డం అంత సులభమైన పనికాదు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత పరాధీనతను వదులుకోవడం మన కార్యక్రమంలో భాగమైంది. ప్రపంచంతో సం బంధాలను కొనసాగిస్తూనే, మన నాగరికత ప్రత్యేకతను కాపాడుకోవడం ముఖ్యమైంది. ఈ ఆదర్శాన్ని విశ్వభారతి కొనసాగిస్తుందని ఆశిస్తున్నా. యువత శక్తిసామర్థ్యాలను జాతి ప్రయోజనాల కోసం ఉపయోగించడం కోసం ఎందరో చింతనాపరులు ప్రయత్నించారు. వీరిలో మహాత్మా గాంధీ, రవీంద్రనాథ్ ఠాగోర్ ప్రముఖులు. వీరు తమదైన రీతిలో (సబర్మతి, శాంతి నికేతన్) ఆశ్రమ విధానాన్ని అనుసరించడం యాదృచ్ఛికం కాదు.
యువత రాజకీయాల్లోకి రావాలి. స్వార్థం కోసమో, డబ్బు కోసమో కాదు. మరి దేనికోసం రావాలి అంటే దేశానికి సంబంధించిన సమస్యలపై సమగ్రమైన అవగాహన రావడానికి, ప్రజాసేవ చేసేందుకు రావాలి. ఇక్కడ మరో విషయం గుర్తుపెట్టుకోవాలి. రాజకీయాల్లో కొనసాగాలంటే మనసుతోనే మాట్లాడుకోవాలి. ఆ మనసుకే సర్దిచెప్పుకోవాలి. అలా చేయలేకపోతే రాజకీయాలు చేయలేం. ఇక ఏది చేసినా దేశం కోసమే కదా.
పీవీ నరసింహరావు
ఇవి కూడా చదవండి..
సాహితీ సోపతి పట్టు – అక్షరాలా.. చిలుకల చెట్టు