‘నేను భాషను ప్రేమిస్తాను. యాసను ప్రేమిస్తాను. భాష నా తల్లి. తల్లిని ప్రేమించని వాడు మనిషే కాదు. కవి అంతకన్నా కాదు అని ప్రఖ్యాత కవి జింబో నా పేరు యాద్గిరి అంటూ ఘోషించాడు. ఏండ్లకు ఏండ్లుగా సుడివడుతున్న జీవితం అయినా.. ఎక్కడా నా పేరు ఎక్కలేదు. పేజీ పేజీలో నేను గాయబ్.. జనం నోట్లోకెళ్ళి ఊడిపడ్డ పదం నిఘంటువుల పదఘట్టనలో నలిగిపోయింది అని ప్రముఖ కవి అన్నవరం దేవేందర్ ’తెలంగాణ వ్యాకరణం’ శీర్షికన ఆక్రోశించాడు.
తెలంగాణ భూమి పుత్రులు తమ ప్రాంత అస్తిత్వాన్ని రెపరెపల పతాకం చేయాలని జ్వలిస్తున్న కాలంలో… ఇట్లాంటి కవిత్వం చైతన్య ఝరిలా ప్రవహించింది. ’మత్తడి’, ’పొక్కిలి’ కవితా సంకలనాలు తెలంగాణ రాష్ట్ర సాధనోద్యమ మలిదశ ఆరంభంలో ఎగిసిపడ్డ కవిత్వ కెరటాలకు దర్పణాలుగా నిలిచాయి. వలస పాలకులు ఎన్ని కుట్రలు కుతంత్రాలు, అసత్య ప్రచారాలతో దాడులుచేసినా అంతకంతకూ ఉద్యమం రాజుకున్నది, రాటుదేలింది. సరిగ్గా 2010లో 120 మంది కరీంనగర్ కవుల కవిత్వంతో ’వల్లుబండ’ కవితా సంకలనం వెలువడింది. రాష్ట్ర సాధన కోసం పోరాడుతున్న విద్యార్థి యువజన ఉద్యమకారులకు అండగా, తెలంగాణ ఆకాంక్షల ప్రతిఫలనంగా ఈ పుస్తకం ముందుకొచ్చింది.
అప్పటికే ఇక్కడి ప్రజల్లో స్థిరపడిపోయిన తెలంగాణా వాదాన్ని ’వల్లుబండ’ కరీంనగర్ రచ్చబండ మీదుగా ప్రతిధ్వనింపజేసింది. ఈ సంకలనాన్ని వెలువరించే ప్రయత్నంలో ఒక్కటైన కవి మిత్రుల చేతుల్లోంచి సాహితీ సోపతి మొలకెత్తింది. ఈ ఏడెనిమిది మంది కవిత్వప్రియుల ఆలోచనల్లో నుంచి సాహితీ సోపతి సంస్థ ఆనాడు పురుడువోసుకున్నది. పెద్ద పెద్ద ఆశయాల ప్రకటనలు లేకుండా తెలంగాణ ఆకాంక్షల వ్యక్తీకరణ ఏకైక అజెండాగా సాహితీసంస్థగా పనిచేయడం ప్రారంభించింది. బహుభాషావేత్త డాక్టర్ నలిమెల భాస్కర్ మార్గదర్శకత్వంలో పాత్రికేయులు నగునూరి శేఖర్, అన్నవరం దేవేందర్, అధ్యాపకులు గాజోజు నాగభూషణం, బూర్ల వేంకటేశ్వర్లు, మ.నా. శర్మతో పాటు సామాజికవేత్త కందుకూరి అంజయ్య తదితర సాహిత్యకారుల నేతృత్వంలో సాహితీ సోపతి నిరంతరంగా సాహిత్యరంగంలో పనిచేస్తున్నది. వీరితోపాటు కొత్తతరం కవులెందరో సాహితీ సోపతితో కలిసి నడుస్తున్నారు. కవిత్వం సృజిస్తున్నారు. సాహితీ సోపతి ప్రచురణగా’కరీంనగర్ ఖాన్దాన్’ పుస్తకం వచ్చింది. దీనిలో ప్రాచీన చారిత్రక వారసత్వ సంపద గూర్చి విలువైన వ్యాసాలున్నాయి.
ఈ పుస్తకాన్ని పునర్ముద్రించాలనే డిమాండ్ కూడా వున్నది. సాహితీ సోపతి చిహ్నంగా నిర్వాహకులు తాబేలును ఎంచుకున్నారు. ఇది ఉభయచరం. అందుకే కాబోలు.. సారస్వత కార్యక్రమాల సంస్థగానూ, ప్రచురణ సంస్థగానూ సాహితీ సోపతి పని చేస్తున్నది. ఎంపిక చేసుకున్న అంశం మీద ప్రణాళికాబద్ధంగా నిదానంగా పనిచేస్తూ పదేండ్లు పూర్తి చేసుకున్నది. దాదాపుగా వంద పుస్తకాలను ఇప్పటివరకు ప్రచురించింది. కవిత్వ కార్యశాలలను, సాహిత్య వర్క్షాపులను కొత్తతరం కవుల కోసం నిర్వహిస్తున్నది. సమకాలీన సాహిత్య విషయాలపై లబ్ధప్రతిష్ఠులైన రచయితలతో సభలు-సమ్మేళనాలను ఏర్పాటుచేస్తున్నది. రాష్ట్ర రాజధానికి 170 కిలోమీటర్ల దూరంలోని కరీంనగర్ జిల్లా కేంద్రంలో.. తెలంగాణ చరిత్రను దాని అస్తిత్వాన్ని తవ్వితీసే సాహిత్య సంస్థగా పదేండ్లుగా విశిష్టమైన కృషి కొనసాగించడం ఆషామాషీ కాదు. కవిత్వం చదవడం కన్నా దాన్ని అచ్చులో చూసుకోవడం ఎంతో శ్రమతో కూడిన పని. ఇరవై ఐదు మంది కొత్త కవులు సాహితీ సోపతి ఆసరాతో తమ కవితా సంపుటాలను తీసుకుని వచ్చారు. సాహితీసోపతి ప్రస్థానంలో కరీంనగర్ కవిత పేరిట కవితా సంకలనాల ప్రచురణ గుర్తుంచుకోదగిన అంశం. వీరగోని పెంటయ్య రచించిన ఊరవిష్కెల పోరు వంటి కథల సంపుటి కల్లోల కాలం నాటి తెలంగాణ జీవికను చిత్రిక పట్టింది. ఇలా చెప్పుకుంటూపోతే.. దీని ప్రచురణల్లో దేనికదే అద్వితీయ పుస్తకం.
సాహిత్యాభిరుచిని కొత్తతరాలకు అందించే వారధిగా, వాహికగా సాహితీసోపతి కరీంనగర్లో నిరంతరంగా పనిచేస్తున్నది. 2013లో తెలంగాణ రచయితల వేదిక (తెరవే) ‘ఎన్నీల ముచ్చట్లు’ కవితాగానం కార్యక్రమాన్ని ప్రారంభించింది. ప్రతినెల పౌర్ణమి రోజున ఈ సాహిత్య గోష్ఠి వుంటుంది. ఈ సందర్భంగా వచ్చిన కవితలను సంకలనాలుగా సాహితీ సోపతి ప్రచురిస్తున్నది. ప్రచురణ రంగంలో తెరవే సాహిత్యానికి చేదోడు వాదోడుగా నిలుస్తున్నది. అర్వాచీన, ప్రాచీన సాహిత్య సౌరభాలను పరీవ్యాప్తం చేస్తూ.. అన్ని వర్గాల రచయితలకు సోపతిగా ఉంటూ పదేండ్ల పండుగను బాబూ జగ్జీవన్రామ్ జయంతి రోజున (5 ఏప్రిల్ 2021) లోకసత్తా సామాజికవేత్త నరెడ్ల శ్రీనివాస్ ప్రాంగణంలో సాహితీ సోపతి కరీంనగర్లో జరుపుకోనున్నది. ఈ కార్యక్రమాన్ని కవిత్వ, కథల ముచ్చట పేరిట నిర్వాహకులు నిర్వహించబోతున్నారు. రాష్ట్ర అవతరణ అనంతరం సాహితీసోపతి లాంటి ఉత్తమ అభిరుచి కలిగిన సారస్వత సంస్థల అవసరం మరింత పెరిగింది.
సి.వి.కుమార్
(నేడు కరీంనగర్లో సాహితీ సోపతి పదేండ్ల సభ సందర్భంగా..)
ఇవి కూడా చదవండి..