లక్నో: ప్రభుత్వ స్కూల్లో మధ్యాహ్న భోజనం తిన్న తర్వాత విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. అయితే వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించకపోగా మంత్రగాడిని స్కూల్కు పిలిపించారు. విస్తూపోయే ఈ సంఘటన ఉత్తరప్రదేశ్లోని మహోబా జిల్లాలో జరిగింది. కుల్పహాడ్ పరిధిలోని ఒక ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనం తిని 15 మంది విద్యార్థినులు అనారోగ్యానికి గురయ్యారు. అయితే ఆ స్కూల్ సిబ్బంది వారిని హాస్పిటల్కు తరలించలేదు. అస్వస్థత చెందిన బాలికల చికిత్స కోసం మాంత్రికుడ్ని పిలిపించారు.
కాగా, పోలీసులు, అధికారులకు ఈ విషయం తెలిసింది. దీంతో వారు వెంటనే ఆ స్కూల్కు చేరుకున్నారు. మాంత్రికుడ్ని అక్కడి నుంచి వెళ్లగొట్టారు. అస్వస్థత చెందిన విద్యార్థినులను స్థానిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. ఆహార నమూనాలు సేకరించి ల్యాబ్కు పంపారు. బాలికల చికిత్స కోసం మంత్రగాడిని పిలిపించడంపై దర్యాప్తు చేపట్టారు.
మరోవైపు మూడు రోజుల కిందట ఆ స్కూల్కు చెందిన కొందరు విద్యార్థులు కూడా అనారోగ్యానికి గురైనట్లు తెలిసింది. అయితే ఆ స్కూల్లో దెయ్యాలు తిరుగుతున్నాయని, అందుకే తమ పిల్లలు అస్వస్థతకు గురవుతున్నారని స్థానికులు తెలిపారు. తెల్ల చీర కట్టుకున్న ఒక మహిళను తొలుత ఒక బాలిక చూసినట్లు చెప్పారు.