న్యూఢిల్లీ : వయసు నిర్ధారణకు పాఠశాల ఇచ్చే సర్టిఫికెట్కే మొదటి ప్రాధాన్యం ఇవ్వాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. స్కూల్ సర్టిఫికెట్, మున్సిపాలిటీ, స్థానిక సంస్థలు ఇచ్చే జనన ధ్రువీకరణ పత్రం లేకపోతేనే చివరిగా వైద్యులు ఆసిఫికేషన్ పరీక్ష ద్వారా నిర్ధారించే వయసును ప్రామాణికంగా తీసుకోవాలని పేర్కొన్నది. వినోద్ కటారా అనే వ్యక్తి 40 ఏండ్ల క్రితం జరిగిన ఓ హత్య కేసులో దోషిగా తేలి యావజ్జీవ శిక్ష అనుభవిస్తున్నాడు.
2016 ఆగస్టులో అలహాబాద్ హైకోర్టు.. ఈ కేసు విచారణ జరుగుతున్నప్పుడు హత్య చేసిన నాటికి ముద్దాయి మైనర్ అయి ఉండొచ్చని అనుమానించి వయసును నిర్ధారించాలని జువెనైల్ జస్టిస్ బోర్డును ఆదేశించింది. ఆసిఫికేషన్ పరీక్ష చేసిన మెడికల్ బోర్డు ముద్దాయికి 56 ఏండ్లు ఉంటాయని నిర్ధారించింది. దీని ప్రకారం హత్య జరిగిన సమయానికి తన వయసు 15 ఏండ్లే ఉంటాయని, మైనర్గా పరిగణించి శిక్ష తగ్గించాలని అతడు సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఆగ్రా అడిషనల్ డిస్ట్రిక్ట్ సెషన్స్ జడ్జి విచారణ జరిపి.. హత్య చేసే నాటికి అతడు మేజర్ అని స్కూల్ రికార్డులను బట్టి తేల్చారు.