న్యూఢిల్లీ, నవంబర్ 8: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన లఖింపూర్ ఖీరీ కేసు విచారణలో బీజేపీ నేతృత్వంలోని యూపీ ప్రభుత్వం వైఖరిపై సుప్రీంకోర్టు మరోసారి అసహనం వ్యక్తం చేసింది. కేసు విచారణలో ఎలాంటి పురోగతి లేదని మండిపడింది. తాము ఆశించినట్టుగా విచారణ సాగడం లేదని అసంతృప్తి వ్యక్తం చేసింది. రెండు ఎఫ్ఐఆర్లను కలిపి విచారించడాన్ని చూస్తుంటే.. పోలీసులు నిందితుడికి అనుకూలంగా వ్యవహరిస్తున్నట్టు కనిపిస్తున్నదని తీవ్ర వ్యాఖ్యలు చేసింది. కేసు విచారణ కోసం.. యూపీ సర్కారు నియమించిన ఒకే సభ్యుడితో కూడిన జ్యుడీషియల్ కమిషన్పై తమకు విశ్వాసం లేదని పేర్కొంది. ఈ కేసును మరో హైకోర్టు మాజీ న్యాయమూర్తి పర్యవేక్షించేలా ఆదేశాలిచ్చే యోచనలో ఉన్నట్టు తెలిపింది. నిష్పక్షపాతంగా, స్వతంత్రంగా, పారదర్శకంగా కేసు విచారణ జరిగేందుకే ఈ ప్రతిపాదన తీసుకొచ్చినట్టు వెల్లడించింది. దీనిపై శుక్రవారంలోగా (నవంబర్ 12) యూపీ ప్రభుత్వం స్పందన తెలియజేయాలని ఆదేశించింది. ఈ మేరకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ హిమాకోహ్లీతో కూడిన ధర్మాసనం సోమవారం కీలక వ్యాఖ్యలు చేసింది. ఉత్తరప్రదేశ్లోని లఖింపుర్లో గతనెల 3న రైతులు శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తున్న సమయంలో కేంద్రమంత్రి అజయ్మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రా వాహన శ్రేణి వారి మీద నుంచి దూసుకెళ్లింది. ఈ ఘటనలో నలుగురు రైతులు చనిపోగా, అనంతరం జరిగిన ఘర్షణలో మరో నలుగురు మరణించారు. ఈ కేసులో ఇప్పటికే ఆశిష్ మిశ్రాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
నిందితుడి వాంగ్మూలాలే రికార్డు చేయడమేంటి?
కేసులో రెండు ఎఫ్ఐఆర్లను కలిపి విచారించడాన్ని కోర్టు ఈ సందర్భంగా ప్రస్తావించింది. ‘రెండు ఎఫ్ఐఆర్లను కలిపి విచారించడాన్ని చూస్తుంటే.. నిందితుడికి అనుకూలమైన పరిస్థితుల్ని కల్పిస్తున్నట్టు కనిపిస్తున్నది. రెండు ఎఫ్ఐఆర్లలో ఒకటి రైతుల హత్యది కాగా, రెండోది రాజకీయ కార్యకర్తలు, జర్నలిస్టు హత్యకు సంబంధించినది. రెండింటిని విడి, విడిగా విచారించాలి. నిందితుడికి అనుకూలంగా ఉన్న వాంగ్మూలాలు మాత్రమే రికార్డు చేయడం ఏమిటి?’ అని కోర్టు ప్రశ్నించింది.
కొత్త విషయమేమీ లేదు!
సిట్ సమర్పించిన నివేదికపైనా సుప్రీంకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. స్టేటస్ రిపోర్టులో ‘మరికొందరు సాక్షులను విచారించాం’ అనేమాట తప్ప, మరో కొత్త విషయమేమీ లేదని పేర్కొంది. పదిరోజుల సమయం ఇచ్చినప్పటికీ, ఆశించిన రీతిలో విచారణ సాగడంలేదని అసంతృప్తి తెలిపింది. కేసులో అరెస్టయిన 13 మంది నిందితుల్లో ఆశిష్మిశ్రా మొబైల్ను మాత్రమే స్వాధీనం చేసుకున్నారని, మిగతా నిందితుల మొబైల్స్ను ఎందుకు స్వాధీనం చేసుకోలేదని ప్రశ్నించింది.