న్యూఢిల్లీ : మహారాష్ట్ర సంక్షోభానికి సంబంధించి శివసేన ఇరు వర్గాల ఎమ్మెల్యేల అనర్హత విషయంలో తదుపరి చర్యలను నిలిపివేయాలని సుప్రీంకోర్టు సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. రెబెల్ నేత ఏక్నాథ్ షిండే గ్రూపునకు చెందిన 39 ఎమ్మెల్యేల అనర్హత కేసును జులై 11న విచారణ చేపడతామని గతంలో సర్వోన్నత న్యాయస్ధానం తెలిపిందని ఉద్ధవ్ ఠాక్రే తరపున వాదనలు వినిపించిన కపిల్ సిబల్ కోర్టు దృష్టికి తీసుకొచ్చారు.
ఈ కేసులో సంబంధం ఉన్న అన్ని పార్టీల వాదన విన్న తరువాత ఓ నిర్ణయం తీసుకుంటామని సర్వోన్నత న్యాయస్ధానం స్పష్టం చేసింది. ఈ కేసును ఓ కొలిక్కి తీసుకువచ్చేందుకు నూతన బెంచ్ను కోర్టు ఏర్పాటు చేసేవరకూ అనర్హత ప్రక్రియపై ఎలాంటి చర్యలు, విచారణ చేపట్టవద్దని స్పీకర్కు తెలియచేయాలని కోర్టు పిటిషనర్లను కోరింది. ఈ విషయం స్పీకర్ దృష్టికి తీసుకువెళతానని గవర్నర్ తరపున హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోర్టుకు తెలిపారు.
ఇక శివసేన ఎమ్మెల్యేల అనర్హత విషయంలో నాలుగు పిటిషన్లు కోర్టు ముందు పెండిగ్లో ఉన్నాయి. మహారాష్ట్రలో ఏక్నాథ్ షిండే నేతృత్వంలో శివసేన ఎమ్మెల్యేల తిరుగుబాటుతో బలపరీక్షకు ముందే ఉద్ధవ్ ఠాక్రే సీఎం పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఇక మహారాష్ట్ర నూతన సీఎంగా ఏక్నాథ్ షిండే, డిప్యూటీ సీఎంగా బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ పదవీ బాధ్యతలు చేపట్టారు.