Supreme Court | రాబోయే జనాభా గణనలో ఇతర వెనుకబడిన తరగతుల (OBC’s) కుల ఆధారిత జనాభా గణన చేపట్టేలా కేంద్రానికి దిశానిర్దేశం చేయాలని దాఖలైన పిటిషన్పై సుప్రీంకోర్టు విచారణ జరిపింది. ఈ మేరకు కేంద్రం స్పందన కోరుతూ నోటీసులు ఇచ్చింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ పీఎస్ నరసింహలతో కూడిన ధర్మాసనం పిటిషన్పై విచారణ జరిపింది. ఇదిలా ఉండగా.. ఓబీసీల కుల ఆధారిత జనాభా గణన డిమాండ్పై కేంద్ర ప్రభుత్వం, సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖకు నోటీసులు జారీ చేస్తూ స్పందన కోరింది.
ఈ అంశంపై వాదనలు విన్న న్యాయస్థానం ఈ అంశాన్ని.. మరో అంశంతో కలిపి జాబితాలో చేర్చింది. న్యాయవాది కృష్ణ కన్హయ్యపాల్ పిటిషన్ దాఖలు చేయగా.. ఈ మేరకు సర్వోన్నత న్యాయస్థానం విచారణ చేపట్టింది. కులాల వారీగా సర్వే, జనాభా గణన లేకపోవడంతో ప్రభుత్వాలు వెనుకబడిన తరగతులకు చెందిన అన్నివర్గాలకు సంక్షేమ ఫలాలు అందజేయలేకపోతున్నాయని తెలిపారు. సరైన డేటా లేకపోవడంతో ఖచ్చితమైన విధానాలను రూపొందించలేమన్నారు. 2018లో అప్పటి కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ ఏబీసీ జనాభా గణనను ప్రకటించారని కన్హయ్య పాల్ పిటిషన్లో పేర్కొన్నారు. 2021 జనాభా లెక్కల సమయంలో ఓబీసీ జనాభా గణన వివరాలను ప్రత్యేకంగా సేకరిస్తామని చెప్పారని గుర్తు చేశారు.