NEET-PG | పీజీ వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే నేషనల్ ఎల్జిబిలిటీ కం ఎంట్రన్స్ టెస్ట్ (నీట్)-పీజీ 2023ని వాయిదా వేయాలని దాఖలైన పిటిషన్లను విచారించడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం మార్చి ఐదో తేదీన నీట్-పీజీ 2023 జరుగనున్నది. ఈ పిటిషన్లపై జస్టిస్లు ఎస్ఆర్ భట్, దీపంకర్ దత్తాల సారధ్యంలోని ద్విసభ్య ధర్మాసనం పరిశీలించింది. దీనిపై నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ (ఎన్బీఈ) తరపున విచారణకు హాజరైన అదనపు సొలిసిటర్ జనరల్ (ఏఎస్జీ) ఐశ్వర్యభాటి స్పందిస్తూ.. సోమవారం నుంచి నీట్-పీజీ 2023 అడ్మిట్ కార్డుల జారీ ప్రక్రియ మొదలైందని, జూలై 15 నుంచి కౌన్సెలింగ్ మొదలవుతుందని తెలిపారు.
`మా టెక్నాలజీ పార్టనర్కు సమీప భవిష్యత్లో పరీక్ష నిర్వహించడానికి తేదీలు అందుబాటులో లేవు` అని ధర్మాసనానికి ఐశ్వర భాటి తెలిపారు. అదనపు సొలిసిటర్ జనరల్ అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకున్న న్యాయస్థానం.. నీట్-పీజీ 2023 పరీక్షను వాయిదా వేయాలని దాఖలైన పిటిషన్లను విచారించడానికి నిరాకరించింది.
తమ ఇంటర్న్షిప్ కటాఫ్ తేదీ పొడిగించినందున ఆగస్టు 11 తర్వాత కౌన్సెలింగ్ జరుగుతుందని పేర్కొంటూ పిటిషనర్లు తమ పిటిషన్లలో కోరారు. ఈ నెల 24న జరిగిన విచారణకు హాజరైన నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ తరఫు న్యాయవాది స్పందిస్తూ.. నీట్-పీజీ 2023 కోసం దాదాపు 2.09 లక్షల మంది అభ్యర్థులు హాజరయ్యారని ధర్మాసనం దృష్టికి తెచ్చారు. ఒకవేళ ఈ ఎంట్రన్స్ పరీక్ష ఇప్పుడు వాయిదా వేస్తే, సమీప భవిష్యత్లో నిర్వహించడానికి తేదీ అందుబాటులో లేదన్నారు.
పీజీ వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశానికి నీట్-పీజీ పరీక్షను షెడ్యూల్ ప్రకారం మార్చి 5న నిర్వహిస్తామని ఈ నెల 10న లోక్సభలో కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మానుసుఖ్ మాండవీయ ప్రకటించారు. ఎంబీబీఎస్ పూర్తి చేసుకున్న విద్యార్థులకు ఇంటర్న్షిప్ పొడిగిస్తామని తెలిపారు. నీట్-పీజీ 2023 అభ్యర్థులు తప్పనిసరిగా ఏడాది ఇంటర్న్షిప్ పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది. దీంతో ఇంటర్న్షిప్ కటాఫ్ తేదీని జూన్ 30 నుంచి ఆగస్టు 11కి పొడిగిస్తున్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ పొడిగించింది.