ముంబై: మహారాష్ట్రలోని ఆరే అటవీ ప్రాంతంలో కోర్టు అనుమతికి మించి ఎక్కువ సంఖ్యలో చెట్లను నరికివేశారు. ఈ నేపథ్యంలో ముంబై మెట్రో రైల్ కార్పొరేషన్పై సుప్రీంకోర్టు సోమవారం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ సంస్థకు రూ.10 లక్షల జరిమానా విధించింది. రెండు వారాల్లో ఈ మొత్తాన్ని చెల్లించాలని ఆదేశించింది. అలాగే ఆ సంస్థ అధికారులను జైలుకు పంపుతామని కూడా హెచ్చరించింది. ముంబై మెట్రో రైల్ కార్పొరేషన్ సీఈవోను కోర్టుకు హాజరుకావాలని ఆదేశించింది. అటవీ పునరుద్ధరణ చర్యలను నిర్దేశించిన గడువులోగా పూర్తి చేయాలని సూచించింది. దీనిని పరిశీలించేందుకు ఒక బృందాన్ని ఏర్పాటు చేయాలని ఐఐటీ బాంబేను కోరింది.
కాగా, ముంబై నగరానికి ప్రాణవాయువుగా పేర్కొనే ఆరే అటవీ ప్రాంతంలో మెట్రో రైల్ షెడ్ (Aarey metro shed) నిర్మాణాన్ని గతంలో ఉధ్ధవ్ ఠాక్రే ప్రభుత్వం నిలిపివేసింది. అయితే మహారాష్ట్రలో ప్రభుత్వం మారడంతో సీఎం ఏక్నాథ్ షిండే ఈ ప్రాజెక్ట్ కొనసాగింపుపై గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఆ ప్రాంతంలో భారీగా చెట్లను నరికివేశారు. అటవీ సంరక్షణ కార్యకర్తలతోపాటు స్థానికులు ఈ చర్యను వ్యతిరేకిస్తున్నారు. 2019 నవంబర్లో సుప్రీంకోర్టు ఆమోదించిన యథాతథ స్థితిని ఉల్లంఘించడంపై కొందరు కోర్టును ఆశ్రయించారు. 84 చెట్లను తొలగించేందుకు కోర్టు అనుమతించగా ముంబై మెట్రో సంస్థ 177 చెట్లను నరికివేసిందని ఆరోపించారు.
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్, న్యాయమూర్తులు పీఎస్ నరసింహ, జేబీ పార్దీవాలాతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్లపై సోమవారం విచారణ జరిపింది. ముంబై మెట్రో సంస్థ తరుఫున కోర్టుకు హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ఆ సంస్థ చర్యను సమర్థించేందుకు ప్రయత్నించారు. 2019లో 84 చెట్ల నరికివేతకు కోర్టు అనుమతి ఇచ్చిందని, అయితే అనంతర కాలంలో అక్కడి మొక్కలు చెట్లుగా పెరిగాయని చెప్పారు. పిటిషనర్ల తరపున సీనియర్ న్యాయవాదులు సీయూ సింగ్, గోపాల్ శంకరనారాయణ కూడా తమ వాదనలు వినిపించారు. ట్రిమ్ చేసేందుకు అనుమతించిన చెట్లను కూడా నరికివేసినట్లు ఆరోపించారు.
ఇరువైపు వాదనలు విన్న సుప్రీంకోర్టు, ముంబై మెట్రో రైల్ కార్పొరేషన్ చర్యను తప్పుపట్టింది. కోర్టు ఆదేశాలను ధిక్కరించి అనుమతించిన దాని కంటే ఎక్కువగా చెట్లను నరికివేయడంపై మండిపడింది. రెండు వారాల్లో రూ.10 లక్షల జరిమానా చెల్లించాలని ఆదేశించింది. అలాగే అటవీకరణను నిర్దేశించిన గడువులోగా పూర్తి చేయాలని సూచించింది. దీనిని పరిశీలించేందుకు ఒక బృందాన్ని ఏర్పాటు చేయాలని ఐఐటీ బాంబే డైరెక్టర్ను కోరింది. దీనికి సంబంధించిన నివేదికను మూడు వారాల్లో కోర్టుకు సమర్పించాలని ధర్మాసనం పేర్కొంది.
Also Read: