ప్రతిభకు రిజర్వేషన్ ప్రతిబంధకం కాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. వెనుకబాటుతనాన్ని పరిష్కరించడంలో రిజర్వేషన్ల పాత్రను తోసిపుచ్చలేమని అభిప్రాయపడింది. సామాజిక న్యాయాన్ని అందించడంలో ఇవి సాయపడుతాయన్నది. సామాజిక, ఆర్థిక నేపథ్యానికి సంబంధించి మెరిట్ తప్పనిసరిగా సందర్భానికి తగ్గట్టుగా ఉండాలని పేర్కొన్నది.
న్యూఢిల్లీ, జనవరి 20: నీట్ యూజీ, పీజీ ప్రవేశాల్లో ఓబీసీలకు 27 శాతం రిజర్వేషన్లకు అనుమతిస్తూ 7వ తేదీన ఇచ్చిన ఆదేశాలను సమర్థించింది. ఓబీసీలకు 27 శాతం రిజర్వేషన్ రాజ్యాంగబద్ధమేనని స్పష్టం చేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ ఏఎస్ బోపన్నతో కూడిన ధర్మాసనం గురువారం కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రస్తుత విద్యా సంవత్సరానికి సంబంధించి ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు (ఈడబ్ల్యూఎస్) రూ.8 లక్షల ఆదాయపరిమితిని వర్తింపజేయాలని ఆదేశించింది.
మరింత మంది వైద్యులు కావాలి
ప్రస్తుతం దేశంలో కొవిడ్ మహమ్మారి సృష్టిస్తున్న కల్లోలం దృష్ట్యా దవాఖానల్లో మరింత మంది వైద్యులు ఉండాల్సిన అవసరమున్నదని కోర్టు అభిప్రాయపడింది. అర్హత, ఇతరత్రా విషయాల్లో ఏమాత్రం మార్పులు జరిపినా నీట్ ప్రవేశాలు ఆలస్యమై వైద్య వ్యవస్థపై అదనపు భారం పడేదని పేర్కొంది. తాజా ఆదేశాల ప్రకారం ఈ ఏడాది కౌన్సెలింగ్ చేపట్టాలని ఆదేశించింది. ఆర్థికంగా వెనుకబడిన వర్గాల రిజర్వేషన్లపై మార్చి మూడో వారంలో సమగ్ర విచారణ జరుపుతామని తెలిపింది. నీట్లో ఓబీసీలకు 27 శాతం, ఈడబ్ల్యూఎస్కు 10 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ 2021 జూలై 29న కేంద్రం జారీ చేసిన నోటిఫికేషన్ను పిటిషనర్లు సవాల్ చేసిన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్ల విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ఈడబ్ల్యూఎస్ వర్గాలకు రూ.8 లక్షల పరిమితిని ఏ ప్రాతిపదికతో నిర్ణయించారని కేంద్రాన్ని ప్రశ్నించింది. దీనిపై పునఃపరిశీలన జరుపుతామని, ఈ ప్రక్రియకు నాలుగు వారాల సమయం కావాలని కేంద్రం 2021 నవంబర్ 25న నివేదించింది. తదనంతరం ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీ డిసెంబర్ 31న సమర్పించిన నివేదికలో రూ.8 లక్షల ఆదాయపరిమితిని సమర్థించింది. అయితే దానిని అమలు చేయడంలో కొన్ని మార్పుచేర్పులు సూచించింది.
‘ఓబీసీ క్రీమీలేయర్ పరిమితిని సవరించాలి’
రిజర్వేషన్ల కేటాయింపులో కుటుంబ వార్షిక సమగ్ర ఆదాయాన్ని పరిగణనలోకి తీసుకోవాలన్న నిర్ణయాన్ని కేంద్రం పునఃపరిశీలించాలని ఓబీసీ ఉద్యోగ సంఘాల అఖిలభారత సమాఖ్య కేంద్రాన్ని కోరింది. కేంద్ర సామాజిక న్యాయశాఖ మంత్రి వీరేంద్రకుమార్కు సమాఖ్య ఈ మేరకు ఓ లేఖ రాసింది. ఓబీసీలకు విధించిన రూ.8 లక్షల క్రీమీలేయర్ పరిమితిని సవరించాలని లేఖలో విజ్ఞప్తి చేసింది