ప్రైవేట్ మెడికల్ కాలేజీలకు సుప్రీంకోర్టు స్పష్టం
న్యూఢిల్లీ, మే 20: ప్రైవేటు మెడికల్ కాలేజీలు నగదు రూపంలో ఫీజులు తీసుకోవడం(కేపిటేషన్ ఫీజు) నిషిద్ధమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. దీనిపై ఇప్పటికే చట్టం చేసినప్పటికీ కాలేజీలు దీన్ని ఉల్లంఘిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేసింది. విద్యను వ్యాపారంగా మార్చేస్తుంటే కండ్లు మూసుకొని కూర్చోలేమని జస్టిస్ ఎల్ నాగేశ్వర రావు నేతృత్వంలోని ధర్మాసనం వ్యాఖ్యానించింది.
కేపిటేషన్ ఫీజులపై ఫిర్యాదులకు ప్రత్యేకంగా వెబ్ పోర్టల్ ఏర్పాటు చేయాలంటూ దాఖలైన పిటిషన్పై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. దీనిపై తాము నియమించి అమికస్ క్యూరీ(కోర్టు సహాయకులు) చేసిన సిఫారసులను ఆమోదించింది. ‘కేపిటేషన్ ఫీజులపై విద్యార్థులు సమాచారం ఇచ్చేందుకు వీలుగా సుప్రీంకోర్టు పర్యవేక్షణలో ఒక వెబ్సైట్ను ఏర్పాటు చేయాలి. ఈ వెబ్సైట్ను నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్ నిర్వహించాలి’ అని తీర్పునిచ్చింది.