న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్రమోదీ పంజాబ్ పర్యటనలో భద్రతా వైఫల్యంపై దాఖలైన పిటిషన్ను విచారించిన సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రధాని పర్యటనకు సంబంధించి పంజాబ్ ప్రభుత్వం, రాష్ట్ర పోలీసులు, కేంద్ర సంస్థలు ఏర్పా టు చేసిన భద్రతా ఏర్పాట్లకు సంబంధించిన రికార్డులను వెంటనే సేకరించి, భద్రపరచాలని పంజాబ్, హర్యానా హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ను ఆదేశించింది. ఘటనపై దర్యాప్తు చేపట్టేందుకు పంజాబ్ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన వేర్వేరు కమిటీలు తమ దర్యాప్తును వచ్చే సోమవారం వరకు నిలిపివేయాలని కోరింది. ఈ మేరకు భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ హిమా కోహ్లీతో కూడిన ధర్మాసనం ఆదేశించింది. రికార్డులను వెంటనే అప్పగించడంలో పంజాబ్ ప్రభుత్వం, ఆ రాష్ట్ర పోలీసులు, కేంద్ర సంస్థలు రిజిస్ట్రార్ జనరల్కు సహకారం అందించాలని కోర్టు సూచించింది. తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది. ప్రధాని పర్యటనలో భద్రతా వైఫల్యంపై విచారణ జరిపి బాధ్యులైన పంజాబ్ ప్రభుత్వాధికారులపై చర్యలు తీసుకోవాలని, రికార్డులను వెంటనే సేకరించాలని కోరుతూ లాయర్స్ వాయిస్ అనే ఎన్జీవో ఈ పిటిషన్ను దాఖలు చేసింది. విచారణలో భాగంగా కేంద్రం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా, పంజాబ్ ప్రభుత్వం తరఫున రాష్ట్ర అడ్వకేట్ జనరల్ డీఎస్ పట్వాలియా, పిటిషనర్ తరఫున మణీందర్ సింగ్ కోర్టుకు హాజరయ్యారు. విచారణ సమయంలో న్యాయవాదులు, సీజేఐ మధ్య కీలక సంభాషణలు జరిగాయి.
మణీందర్ సింగ్: ప్రధాని మోదీ పర్యటనలో భద్రతా వైఫల్యం శాంతి, భద్రతల సమస్య కాదు. ఇది దేశ భద్రతకు సంబంధించిన సమస్య. దీనిపై పంజాబ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ దర్యాప్తు చేయడానికి ఒప్పుకోబోం. ఎన్ఐఏ వంటి కేంద్ర దర్యాప్తు సంస్థలు కోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు చేయాలి. ప్రధాని పర్యటనకు సంబంధించిన భద్రతా ఏర్పాట్లకు సంబంధించిన అన్ని రికార్డులను భద్రపరచాలి.
తుషార్ మెహతా: మణీందర్ సింగ్ కోరినట్టు ఈ ఘటనపై కోర్టు పర్యవేక్షణలో కేంద్ర దర్యాప్తు సంస్థలచే విచారణ చేపట్టాలని మేమూ కోరుకొంటున్నాం. అవసరమైతే ఎన్ఐఏతో విచారణ జరుపాలి. పంజాబ్ ఏర్పాటు చేసిన కమిటీలో హోంమంత్రి కార్యదర్శి కూడా ఒక సభ్యునిగా ఉన్నారు. ఆ విభాగంపైనే ఆరోపణలు వచ్చినప్పుడు అదే మంత్రిత్వ శాఖకు చెందిన వ్యక్తి కమిటీలో ఎలా ఉంటారు? ఈ ఘటనలో సీమాంతర ఉగ్రవాదానికి అవకాశం ఉన్నది. ప్రధాని భద్రతా వైఫల్యం అరుదైన కేసు. అంతర్జాతీయంగా ఇబ్బంది కలిగించే అంశం.
పట్వాలియా: దర్యాప్తు కమిటీలో ఎవరిని నియమించినా మాకు అభ్యంతరం లేదు. పంజాబ్ ప్రభుత్వం ఈ ఘటనను తేలిగ్గా తీసుకోవట్లేదు. బాధ్యులు ఎస్పీజీ అయినా, పంజాబ్ పోలీసులు అయినా సరే. మాకు సమస్యేమీ లేదు. అయితే స్వతంత్ర దర్యాప్తు కమిటీ చేపట్టే దర్యాప్తులో అసలు నిజాలు బయటకు రావాలసిందే. కేంద్రం ఏర్పాటు చేసిన కమిటీలో స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ ఐజీ ఎస్ సురేశ్ కూడా ఉన్నారు. భద్రతకు సంబంధించి ఆయనదే పూర్తి బాధ్యత. మరి ఆయన్ని దర్యాప్తు కమిటీలో ఎలా నియమించారు?
తుషార్ మెహతా: సురేశ్ స్థానంలో హోంశాఖ కార్యదర్శిని నియమిస్తాం.
సీజేఐ: మెహతా.. పిటిషనర్, పంజాబ్ ఏజీ వాదనలు విన్నారు. రికార్డులను భద్రపరచడంలో ఎలాంటి సమస్య లేదు. ఎవరితోనైనా కమిటీని ఏర్పాటు చేసుకోవచ్చని పంజాబ్ ప్రభుత్వం చెబుతున్నది. అలాగే, కేంద్రం ఏర్పాటు చేసిన కమిటీపై కూడా వాళ్లు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. స్వతంత్ర దర్యాప్తు కమిటీకి మీరు అనుకూలమేనా?
తుషార్ మెహతా: శనివారంలోపు రికార్డులన్నీ మీ ముందుకు రానివ్వండి. మా అభ్యంతరాలు, ఆందోళనలను శనివారం లోపు మీ ముందుంచుతాం. మీరు సోమవారం నిర్ణయం తీసుకోండి.
సీజేఐ: ప్రధాని పర్యటనకు సంబంధించి పంజాబ్ ప్రభుత్వం, రాష్ట్ర పోలీసులు, కేంద్ర సంస్థలు ఏర్పాటు చేసిన భద్రతా ఏర్పాట్లకు సంబంధించిన రికార్డులను పంజాబ్, హర్యానా హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ వెంటనే సేకరించి, భద్రపరుచాలని ఆదేశిస్తున్నాం. పంజాబ్ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన వేర్వేరు కమిటీలు తమ విచారణను వచ్చే సోమవారం వరకు నిలిపివేయాలి. ఈ మేరకు ఈ సమాచారాన్ని ఆయా సభ్యులకు అధికారులు తెలియజేయాలి. విచారణను సోమవారానికి వాయిదా వేస్తున్నాం.
పంజాబ్ ప్రభుత్వాన్ని రద్దు చేయండి
చండీగఢ్: పంజాబ్లో సీఎం చరణ్జిత్ సింగ్ చన్నీ నేతృత్వంలోని ప్రభుత్వాన్ని రద్దు చేయాలని హర్యానా సీఎం మనోహర్లాల్ ఖట్టర్ డిమాండ్ చేశారు. పంజాబ్లో రాష్ట్రపతి పాలన విధించి ఎన్నికలు నిర్వహించాలన్నారు. రాష్ట్రంలో శాంతి, భద్రతల పరిరక్షణ కాంగ్రెస్కు సాధ్యంకావట్లేదని, బుధవారం ప్రధాని పర్యటనే ఇందుకు తాజా ఉదాహరణగా అభివర్ణించారు. ఫిరోజ్పుర్ ఘటన నేపథ్యంలో పంజాబ్ ప్రభుత్వంపై రాష్ట్రపతి కఠిన చర్యలు తీసుకోవాలంటూ ఓ మెమోరండాన్ని హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయకు సమర్పించారు. అంతకు ముందు ప్రధాని మోదీ బాగుండాలని పంచకులలోని మాతా మానసదేవి ఆలయంలో మృత్యుంజయ హోమాన్ని ఖట్టర్ నిర్వహించారు.
రాష్ట్రపతి పాలనకు పెద్ద కుట్ర
పంజాబ్లో రాష్ట్రపతి పాలన విధించడానికి కేంద్రం కుయుక్తులు పన్నుతున్నదని ఆ రాష్ట్ర సీఎం చరణ్జిత్ చన్నీ ఆరోపించారు. దీని కోసం ఓ పెద్ద కుట్రను తెరపైకి తీసుకొచ్చినట్టు చెప్పారు. ప్రధాని పర్యటనలో భద్రతా వైఫల్యం నాటకం ఇందులో భాగమేనన్నారు. పంజాబ్ను, పంజాబీలను హంతకులుగా చిత్రీకరించడానికి కేంద్రం యత్నిస్తున్నదని మండిపడ్డారు. తన ప్రాణాలకు ముప్పు పొంచి ఉన్నదని హోదామరిచి ప్రధాని వ్యాఖ్యానించడం సరైందికాదన్నారు. బీజేపీ ఇప్పటికైనా రాజకీయాలు చేయడం ఆపేయాలని కాంగ్రెస్ నేత నవ్జోత్ సింగ్ సిద్ధూ హెచ్చరించారు.
150 మందిపై ఎఫ్ఐఆర్
ప్రధాని మోదీ పంజాబ్ పర్యటనలో భద్రతా వైఫల్యంపై దర్యాప్తు చేయడానికి కేంద్రం ఏర్పాటు చేసిన కమిటీ శుక్రవారం ఫిరోజ్పుర్లో పర్యటించింది. మరోవైపు, ప్రధాని పర్యటన దర్యాప్తు నివేదికను పంజాబ్ ప్రభుత్వం కేంద్రానికి సమర్పించింది. ఘటనపై 150 మందిపై ఫిరోజ్పుర్ పోలీసు స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్టు వెల్లడించింది.
ప్రధాని నరేంద్ర మోదీ పంజాబ్ పర్యటనలో భద్రతా వైఫల్యమే కాకుండా నేరపూరిత కుట్ర జరిగిందని కేంద్ర మైనారిటీ శాఖ మంత్రి ముక్తర్ అబ్బాస్ నఖ్వి ఆరోపించారు. ప్రధాని బాగుండాలని ముంబైలోని హజీ అలీ దర్గాలో ప్రార్థనలు చేశారు. త్రిపురలో ఆ రాష్ట్ర సీఎం బిప్లబ్ కుమార్ దేబ్ ప్రధాని కోసం ఓ ఆలయంలో మృత్యుంజయ హోమం నిర్వహించారు.