న్యూఢిలీ: జాతిపిత మహాత్మాగాంధీ హత్యకు సంబంధించి ఆయన ముని మనుమడు తుషార్గాంధీ సంచలన ఆరోపణలు చేశారు. గాంధీని హత్య చేయడంలో నాథూరాం గాడ్సేకు వీర్ సావర్కర్ సాయం చేశాడని, గాడ్సేకు ఆయనే తుపాకీ ఏర్పాటు చేశాడంటూ ఓ ట్వీట్ చేశారు. గాంధీ హత్యకు రెండు రోజుల ముందు వరకు గాడ్సే వద్ద ఆయుధం లేదని పేర్కొన్నారు. తన ప్రకటనపై తుషార్ గాంధీ మీడియాతో మాట్లాడుతూ తాను ఎటువంటి ఆరోపణలు చేయడం లేదని, చరిత్రలో నమోదైన విషయాన్నే చెబుతున్నానన్నారు. ‘అప్పటి పోలీసు ఎఫ్ఐఆర్ ప్రకారం.. 1948, జనవరి 26, 27వ తేదీల్లో సావర్కర్ను గాడ్సే, వినాయక్ ఆప్టేలు కలిశారు. ఆ రోజు వరకు గాడ్సే వద్ద ఎటువంటి ఆయుధం లేదు. తుపాకీ కోసం అతను ముంబై అంతా తిరిగాడు. అయితే ఈ పర్యటన తర్వాత గాడ్సే నేరుగా గ్వాలియర్ నుంచి ఢిల్లీ వెళ్లాడు. అక్కడ గాడ్సే ఓ తుపాకీ సంపాదించాడు. బాపు హత్యకు రెండు రోజుల ముందుగా ఇదంతా జరిగింది. ఇదే నేను చెప్పింది. కొత్తగా ఏ ఆరోపణలు చేయడం లేదు’ అని తుషార్ గాంధీ పేర్కొన్నారు. కాగా, గత వారం కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సావర్కర్పై తీవ్ర విమర్శలు చేసిన విషయం తెలిసిందే.