న్యూఢిల్లీ : ఢిల్లీ మంత్రి సత్యేందర్ జైన్కు ఎదురుదెబ్బ తగిలింది. ఈ నెల 13 వరకు ఆయనను కోర్టు ఈడీ కస్టడీకి ఇస్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే, విచారణ అనంతరం వచ్చిన అనంతరం సత్యేందర్ జైన్ ఆరోగ్యం క్షీణించింది. వెంటనే ఆయనను వెంటనే రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రికి తరలించారు. ఈ సందర్భంగా ఆయనకు పలు పరీక్షలు చేయించాలని ఆసుపత్రి వైద్యులు సూచించారు. సత్యేందర్ జైన్ తరఫు న్యాయవాది హృషికేశ్ కుమార్ మాట్లాడుతూ.. కరోనా సోకినప్పటి నుంచి ఆయన స్లీప్ అప్నియా (నిత్ర సంబంధిత సమస్య)తో బాధపడుతున్నారని తెలిపారు.
కోర్టులో నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆయన ఆరోగ్యం క్షీణించిందని పేర్కొన్నారు. మనీలాండరింగ్ కేసులో జైన్ను మే 30న అరెస్టు చేసింది. అప్పటి నుంచి ఆయన ఈడీ కస్టడీలోనే ఉన్నారు. గురువారం కస్టడీ ముగియక ముందే ఢిల్లీలోని రూస్ అవెన్యూ కోర్టులో హాజరు పరుచగా.. నాలుగు రోజులు కస్టడీకి కోర్టు అనుమతించింది. ఈడీ చేసిన దరఖాస్తు ప్రత్యేక న్యాయమూర్తి గీతాంజలి గోయెల్ అనుమతి ఇచ్చారు.
అయితే, కస్టడీపై ఈడీ తరఫున అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్వీ రాజు వాదనలు వినిపిస్తూ గతంలో కస్టడీ సమయంలో ఏజెన్సీ పలు చోట్ల దాడులు చేసి నగదు, పత్రాలు సహా నేరారోపణలు లభించాయని తెలిపారు. కొన్ని పత్రాల ఆధారంగా జైన్ను ఏజెన్సీ ఇంకా విచారించాల్సి ఉందని ఆయన కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. జైన్ తరఫు సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్, సత్యేంద్ర ఇప్పటికే ఈడీ కస్టడీలో ఉన్నారని, దాన్ని కొనసాగించేందుకు ఎలాంటి కారణాలు లేవని, ఈడీ దరఖాస్తును వ్యతిరేకించారు.