న్యూఢిల్లీ, మార్చి1: మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల కుమారుడు జైన్ నాదెళ్ల(26) కన్ను మూశారు. పుట్టుకతోనే మెదడు, కండరాలకు సంబంధించిన ‘సెరెబ్రల్ పాల్సీ’ అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్న ఆయన ఆరోగ్యం విషమించడంతో అమెరికా కాలమానం ప్రకారం సోమవారం ఉదయం మరణించారు. ఈ విషయాన్ని మైక్రోసాఫ్ట్ సంస్థ మంగళవారం వెల్లడించింది. జైన్ మృతి పట్ల సోషల్ మీడియాలో సంతాప సందేశాలు వెల్లువెత్తాయి. సత్య నాదెళ్ల, అను దంపతుల ఏకైక కుమారుడు జైన్. వారికి ఇద్దరు కుమార్తెలు. జైన్ వైకల్యంతో వీల్ఛైర్కే పరిమితం కావడంతో పాటు మాట్లాడలేకపోవడం, సరిగ్గా చూడలేకపోవడం వంటి రుగ్మతలతో బాధపడేవాడు. కుమారుడి బాధల్ని చూసిన సత్య నాదెళ్ల అటువంటివారు ఉపయోగించేందుకు వీలైన సాధనాలపై దృష్టిపెట్టారు. మైక్రోసాఫ్ట్ ఉత్పత్తుల్లో మార్పులు చేశారు. తన కుమారుడి ప్రత్యేక అవసరాల్ని తండ్రిగా చూడటం తన జీవితంలో ఒక మలుపు అని ఓ సందర్భంలో సత్య నాదెళ్ల చెప్పారు.
సెరెబ్రల్ పాల్సీ అంటే ఏంటీ?
వ్యక్తి కదలికల సామర్థ్యాన్ని, బ్యాలెన్స్ను ప్రభావితం చేసే రుగ్మతనే సెరెబ్రల్ పాల్సీ(సీపీ) అంటారు. ఇది చిన్నతనంలోనే ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. సెరెబ్రల్ అంటే మెదడుకు సంబంధించినది కాగా, పాల్సీ అంటే కండరాలను వినియోగించడంలో బలహీనత లేదా సమస్య అని అర్థం. మెదడులో సాధారణ ఎదుగుదల లేకపోవడం, వృద్ధిచెందుతున్న దశలోనే దెబ్బతినడం వంటి కారణాల వలన సెరెబ్రల్ పాల్సీ వస్తుంది. సెరెబ్రల్ పాల్సీ తీవ్రస్థాయిలో ఉంటే, అతను నడవలేకపోవచ్చు లేదా నడిచినా ప్రత్యేక పరికరాల సాయం అవసరం అవుతుంది. జీవితకాలం సంరక్షణ ఉండాలి. స్వల్ప తీవ్రత ఉంటే, కొంత దూరం నడువొచ్చు. వారికి ప్రత్యేక సాయం అవసరం ఉండదు.