బెళగావి: కర్ణాటక కాంగ్రెస్లో అధికారం కోసం కుమ్ములాటలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా ముఖ్యమంత్రి పదవిపై అధికార పార్టీ ఎమ్మెల్యే కీలక వ్యాఖ్యలు చేశారు. పీడబ్ల్యూడీ శాఖ మంత్రి సతీశ్ జార్కిహోళి త్వరలోనే ముఖ్యమంత్రి అవుతారని ఎమ్మెల్యే విశ్వాస్ వసంత్ వైద్య జోస్యం చెప్పారు.
మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఉత్తర కర్ణాటక ప్రాంత దళిత వర్గంలో జార్కిహోళి ప్రముఖ నేతగా గుర్తింపు పొందారని, నమ్మకమైన నేతగా ఉన్నారని పేర్కొన్నారు. ప్రజలు ఆయనను ముఖ్యమంత్రి పీఠంపై చూడాలనుకుంటున్నారని అన్నారు. జార్కిహోళి సోదరులు ఇటు కాంగ్రెస్, అటు బీజేపీలోనూ ఎంతో పలుకుబడి ఉన్న వ్యక్తులని అన్నారు. 2028లో సీఎం పీఠం తనదేనని ఇప్పటికే మంత్రి సతీశ్ జార్కిహోళి ప్రకటించారు.