న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలోని కేంద్ర సర్కారుపై పీడీపీ అధ్యక్షురాలు, జమ్ముకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ ( Mehbooba Mufti ) విమర్శలు గుప్పించారు. ఢిల్లీలో అధికారంలో ఉన్నవాళ్లు జమ్ముకశ్మీర్ను ఒక ప్రయోగశాల వాడుకుంటున్నారని ఆమె మండిపడ్డారు. వాళ్లు జమ్ముకశ్మీర్లో రకరకాల రాజకీయ ప్రయోగాలు చేస్తున్నారని ఆరోపించారు.
ఒకప్పుడు జవహర్లాల్ నెహ్రూ, అటల్బిహారీ వాజ్పేయి ప్రధానులుగా ఉన్నప్పుడు జమ్ముకశ్మీర్పట్ల వాళ్లకు ఒక విజన్ అనేది ఉండేదని, కానీ ప్రస్తుత ప్రభుత్వం మాత్రం హిందూ, ముస్లింల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతూ చిచ్చు పెడుతున్నదని ఆమె ఆగ్రహం వ్యక్తంచేశారు. బీజేపీ దృష్టిలో సర్దార్లు ఖలిస్థానీలని, తాము పాకిస్థానీలమని, కేవలం వాళ్లు ( బీజేపీ) మాత్రమే హిందుస్థానీలని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.